పంచాయతీ ఎన్నికలపై నిఘా
విడతల వారీగా 1,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు
ప్రత్యేక టీములు
ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలి. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు చాలా కీలకం. ఒక పండుగలా జరగాలి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహణకు పోలీసు శాఖ ప్రణాళికతో పని చేస్తోంది. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించు కోవడానికి పోలీసులు పూర్తి రక్షణ కల్పిస్తారు. – ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్ : పంచాయతీ ఎన్నికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఘర్షణలు, గొడవలు సృష్టించే వారిపై దృష్టిసారించారు. సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలకు ఐదంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ బహుమతులు, మధ్యం, డబ్బు, వస్తువులు పంచకుండా నిఘా ఉంచి నిరంతరం తనిఖీలు నిర్వహించనున్నారు.
170 సమస్యాత్మక గ్రామాలు
జిల్లాలో మొత్తం 486 గ్రామ పంచాయతీలు, 4388 వార్డులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 170 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. ఇందులో మొదటి విడత 159 గ్రామాల్లో ఎన్నికల జరగనుండగా 47 సమస్యాత్మక గ్రామాలు, రెండవ విడతలో181 గ్రామాలకు గాను 65 సమస్యాత్మక గ్రామాలు, మూడవ విడతలో 146 గ్రామాలకు ఎన్నికలు ఉండగా 58 సమస్యాత్మక గ్రామాలుగా పోలీసులు గుర్తించారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ సిబ్బంది నిత్యం తిరుగుతూ ప్రజలకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పిస్తున్నారు. బైండోవర్ నిబంధనలను వివరిస్తున్నారు. గతంలో నేరాలకు పాల్పడ్డ వారిని, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వారిని గుర్తించి మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడబోమని ముందస్తుగా పూచీకత్తుతో రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు బైండోవర్ చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
24గంటల పాటు తనిఖీలు
జిల్లాలోకి అక్రమంగా వస్తువులను రవాణా చేయకుండా, ప్రజలను ప్రలోభాలకు గురు చేయకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల వెంట ఏడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కోదాడ రూరల్ పరిధిలోని 65వ నంబర్ హైవేలో రామపురం వద్ద చెక్పోస్టు, చింతలపాలెం పరిధిలోని దొండపాడు, మఠంపల్లి పరిధి మట్టపల్లి బ్రిడ్జి, తిరుమలగిరి పరిధి పాత తిరుమలగిరి, మద్దిరాల పరిధి కుంటపల్లి, మోతె పరిది మామిల్లగూడెం వద్ద, సూర్యాపేట రూరల్ పరిధి టేకుమట్ల వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి 24 గంటల తనిఖీలు చేయనున్నారు.
23 మండలాల్లో..
జిల్లాలో 23 మండలాల్లో మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలకు ప్రతి విడతకు 1500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వీరిలో రూట్ మొబైల్స్, ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ట్రైకింగ్ ఫోర్స్, డీఎస్పీ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, వంద మీటర్ల పరిధిలో సిబ్బంది పోలింగ్ బూత్ల వద్ద సిబ్బంది, ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండి ఎన్నికల నిర్వహణను సజావుగా నిర్వర్తించేలా చర్యలు తీసుకోనున్నారు.
విడత రూట్ మొబైల్స్
మొదటి 58
రెండవ 47
మూడవ 45
ఫ అంతర్ రాష్ట్ర, అంతర్
జిల్లా సరిహద్దుల్లో 7 చెక్ పోస్టులు
ఫ 170 సమస్యాత్మక గ్రామాలపై
ప్రత్యేక దృష్టి
స్పెషల్ సెక్యూరిటీ టీములు(ఎస్ఎస్టీ) 04
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) 23
ఫ్లైయింగ్ సర్వేలెన్స్ టీములు(ఎఫ్ఎస్టీ) 23
పోలీస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ 18
పంచాయతీ ఎన్నికలపై నిఘా


