రూపాయికే బీఎస్ఎన్ఎల్ కనెక్షన్
కోదాడ: దీపావళి పండుగను పురష్కరించుకొని బీఎస్ఎన్ఎల్ వినియోగ దారులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కేవలం రూపాయికే ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్ ఇవ్వనుంది. ఈ పథకం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అమలులో ఉంటుందని ఉమ్మడి నల్లగొండ జిల్లా టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి. వెంకటేశం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్క రూపాయితో నెల రోజుల పాటు ఉచితంగా అన్ని నెట్వర్క్లకు అపరిమిత కాల్స్తో పాటు 2 జీబీ డెటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపవచ్చని పేర్కొన్నారు. పోర్టబిలిటీ ద్వారా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్కి మారే వారు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని, సిమ్కార్డ్ ఉచితంగా ఇస్తామని తెలిపారు.
పౌష్టికాహారంతోనే
సంపూర్ణ ఆరోగ్యం
తుంగతుర్తి : పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు పేర్కొన్నారు. గురువారం తుంగతుర్తి మండలం కొత్తగూడెం రైతు వేదికలో నిర్వహించిన పోషణ మాసోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అనంతరం ఆరు నెలలు పూర్తయిన పిల్లలకు అన్న ప్రాసన, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తహసీల్దార్ దయానందం, ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ కృష్ణ, సూపర్వైజర్ ఖైరున్నిసా బేగం, మంగ, అనురాధ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
రెండు గేట్ల ద్వారా
మూసీ నీటి విడుదల
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం మూసీ రిజర్వాయర్కు 3,613 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి 2,748 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 195 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సీపీజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 50 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. మూసీ ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రం వరకు నీటిమట్టం 644.40 అడుగుల(4.30టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేసి స్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో అందంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తికట్టించారు. అనంతరం నిత్యకల్యాణంలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తంలబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనం పై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రవేశంచేసి నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదనచేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
రూపాయికే బీఎస్ఎన్ఎల్ కనెక్షన్


