విధులకు హాజరుకాని సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
మునగాల: కార్యాలయ నిర్దేశిత ప్రారంభ సమయం దాటినా సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంపై కలెక్టర్ తేజస్ నంద్లాల్పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఆరా తీసి విధులకు డుమ్మా కొట్టిన నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. గురువారం మునగాల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ డి.సత్యనారాయణ, ఎంపీఎస్ఓ బి.సంపత్, జూనియర్ అసిస్టెంట్ ఎం.సునీల్ గవాస్కర్, రికార్డ్ అసిస్టెంట్ జి.ప్రశాంత్లు విధులకు రిపోర్ట్ చేయలేదు. ఉదయం 10.30 గంటలు దాటినా విధులకు హాజరుకాకపోవడంతో వీరిని సస్పెండ్ చేశారు. ఈ అంశంపై కలెక్టర్ తహసీల్దార్ను వివరణ కోరారు. కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయ అటెండెన్స్ రిజస్టర్ను పరిశీలించగా మొత్తం కార్యాలయంలో 18 మంది ఉద్యోగులకు గాను నలుగురు డిప్యుటేషన్పై ఇతర కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. మరో ఇద్దరు ఆకస్మిక సెలవులో ఉండగా మరొక ఉద్యోగి సర్వే విధులకు వెళ్లినట్లు గుర్తించారు. కాగా డిప్యూటీ తహసీల్దార్, ఎంపీఎస్ఓ, రికార్డు అసిస్టెంట్, జూనియర్, అసిస్టెంట్ విధులకు హాజరు కాలేదు. మిగిలిన వారు హాజరైనట్లు కలెక్టర్ గుర్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ప్రతి ఉద్యోగి సకాలంలో విధులకు హాజరు కావాలని, ఒకవేళ విధులకు గైర్హాజరైనా, ఆలస్యంగా వచ్చినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి
భానుపురి (సూర్యాపేట) : ఈ వానాకాలం సీజన్ ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏపీఎంలు, సీఈఓ లతో 2025– 26 వానాకాలం సీజన్ ధాన్యం సేకరణ పై వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రెండు మూడు రోజుల్లో అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. సన్న, దొడ్డు వడ్లకు వేర్వేరుగా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల వడ్లు కాంటా అయిన తర్వాత వెంటనే మిల్లులకు తరలించాలని చెప్పారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మండలాల్లో పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా పౌర పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, పార సరఫరాల జిల్లా మేనేజర్ రాము, డీఆర్డీఓ వి.వి అప్పారావు, డీసీఓ పద్మ, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నాగేశ్వర్ శర్మ, సివిల్ సప్లయ్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, బెనర్జీ పాల్గొన్నారు.
ఫ మునగాల తహసీల్దార్
కార్యాలయం తనిఖీ
ఫ డుమ్మా కొట్టిన నలుగురు
ఉద్యోగుల సస్పెన్షన్
ఫ సమయ పాలన పాటించకుంటే
చర్యలు తప్పవని హెచ్చరిక


