
ప్రాజెక్టులు కట్టింది.. నీళ్లిచ్చింది కాంగ్రెస్సే
తిరుమలగిరి (తుంగతుర్తి): ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రాజెక్టులు కట్టింది.. అవి ఇప్పటికీ నాణ్యతగా ఉన్నాయి.. వాటి ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే’ అని తుంగతుర్తి శాసన సభ్యుడు మందుల సామేల్ పేర్కొన్నారు. జనగామ జిల్లా కొడకండ్లలోని బయ్యన్నవాగు రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను సూర్యాపేట జిల్లాకు విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నీటి ప్రాధాన్యతను గుర్తించి ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, పోచంపాడు వంటి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి వందల ఎకరాలకు సాగు నీరు అందించారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, వారి హయాంలోనే అది కూలి పోయిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టులో కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. గోదావరి జలాల ద్వారా సూర్యాపేట జిల్లాలోని 500 చెరువులు, కుంటలు నిండుతాయని తెలిపారు. ఈ జలాల ద్వారా 2.13 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. యూరియా విషయంలో కేంద్రంలో నిబీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
జిల్లాకు గోదావరి జలాలు రాక
బయ్యన్న వాగు నుంచి 500 క్యూసెక్కుల నీటిని ఎమ్మెల్యే మందుల సామేల్ విడుదల చేశారు. వెలిశాల వద్ద గోదావరి జలాలు జిల్లాలోకి ప్రవేశించాయి. 69, 71డీబీఎంలకు నీళ్లు అందాయి. రెండు రోజుల్లో 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు వై.నరేష్, నాగం సుధాకర్రెడ్డి, సత్యం,లింగయ్య, పేరాల వీరేష్, జమ్మిలాల్, నర్సింహారెడ్డి, వీరమల్లు, వెంకట్రెడ్డి, మధుకర్రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మందుల సామేల్
బయ్యన్నవాగు నుంచి గోదావరి
జలాలు విడుదల

ప్రాజెక్టులు కట్టింది.. నీళ్లిచ్చింది కాంగ్రెస్సే