
కలగానే టా్యంక్బండ్!
కోదాడ: కోదాడ పట్టణ ప్రజలు దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న పెద్దచెరువు ట్యాంక్బండ్ నిర్మాణ పనులు కలగానే మిగిలాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే ఈ పనులకు హడావుడిగా శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభించలేదు. ఎన్నికల అనంతరం 2024 ఫిబ్రవరి 23న ప్రస్తుత ఎమ్మెల్యే ఇవే పనులకు శిలాఫలకాలు నిర్మించి మరోసారి శంకుస్థాపన చేశారు. ఇది జరిగి ఏడాదిన్నర కాలం దాటినా పనులు ప్రారంభం కాలేదు. అంతకుముందు 2015లో మిషన్ కాకతీయ పథకం కింద ఇదే ట్యాంక్బండ్ నిర్మాణానికి రూ.4 కోట్లతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఇలా మూడు విడతలుగా చేపట్టిన పనులు పదేళ్లవుతున్నా అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో కోదాడ పెద్దచెరువు ట్యాంక్బండ్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.
రివిట్మెంట్ పనులతోనే సరి..
బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి సారి అధికారంలోకి వచ్చిన తరువాత కోదాడ పెద్దచెరువులో పూడిక తీయడంతోపాటు చెరువు కట్టను అభివృద్ధి చేసి దానిపై వాకింగ్ట్రాక్ ఏర్పాటుకు పూనుకుంది. దీంతోపాటు పెద్దచెరువు ఉత్తరం వైపు 10 ఎకరాల స్థలంలో గార్డెన్ ఏర్పాటు చేస్తామని రూ.4 కోట్లతో 2015లో పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ కట్టమట్టి పనులతో పాటు లోపలివైపు రివిట్మెంట్ పనులు చేసి బిల్లులు రావడం లేదని మధ్యలోనే వదిలి వెళ్లాడు. ఆ తరువాత కోదాడ మున్సిపాలిటీ నిధుల నుంచి అసంపూర్తిగా ఉన్న కట్టపై రూ.30 లక్షలతో లైట్లు, కట్ట ఎక్కడానికి అనువుగా అనంతగిరి రోడ్డు నుంచి చెరువు కట్టవరకు రోడ్డు నిర్మించారు. ఇది మూణ్నాళ్ల ముచ్చటేగానే మిగిలింది. నిర్వహణ సక్రమంగా లేక లైట్లు వెలగడం లేదు. చెరువు కట్ట మొత్తం కంపచెట్లతో నిండి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. చెరువు కట్టపై వేసిన సిమెంట్ బెంచీలను ఆకతాయిలు విరగ్గొట్టారు.
రూ.6 కోట్లతో అభివృద్ధి చేస్తామని..
గత అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోదాడ పెద్ద చెరువు ట్యాంక్బండ్ను అభివృద్ధి చేస్తామని, దీనికి తెలంగాణ అర్బన్ పైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.6 కోట్లు మంజూరయ్యాయని ప్రకటించారు. ఈ పనులకు అప్పటి మంత్రి జగదీష్రెడ్డితో కలిసి 2023 అక్టోబర్ 6న శంకుస్థాపన చేశారు. కానీ, పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈలోగా ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో పెద్ద చెరువు ట్యాంక్బండ్ ముచ్చట అటకెక్కింది. ఈ పనులతో పాటు మరో రూ.12 కోట్లతో జంక్షన్ల అభివృద్ధి కూడా చేస్తామని నాడు శంకుస్థాపన చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం కోదాడ పెద్దచెరువు కట్టను పూర్తిగా కంపచెట్లు కమ్మేశాయి. ఇక చెరువు ఉత్తరం వైపున ఏర్పాటు చేస్తామని చెప్పిన పార్కు అతీగతి లేకుండా పోయింది.
పదేళ్లుగా కోదాడ పెద్ద చెరువుకు కలగని మోక్షం
ఫ పనులకు రెండుసార్లు శంకుస్థాపన చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు
ఫ ఇప్పటికీ ఒక్క అడుగు కూడా
ముందుకు పడలే..
ఫ కంపచెట్లతో నిండిన చెరువు కట్ట
ఫ బిల్లులందక మధ్యలోనే నిలిచిన
మిషన్ కాకతీయ పనులు

కలగానే టా్యంక్బండ్!