
సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా..
త్వరలోనే కేంద్రాలు ప్రారంభం
సూర్యాపేటటౌన్ : సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) పేరుతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. పాఠశాలలు అందుబాటులో లేక, ఇతర కారణాలతో చదువుకు దూరంగా ఉన్న 15 ఏళ్లు దాటిన నిరక్షరాస్యులను గుర్తించి సామాజిక చైతన్య కేంద్రాల్లో అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా స్థాయిలో రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా నిరక్షరాస్యుల వివరాలను ఉల్లాస్ యాప్లో నమోదు చేశారు.
నిరక్షరాస్యుల గుర్తింపు.. వలంటీర్ల ఎంపిక పూర్తి
జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో 41,117 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. వీరికి చదువు చెప్పడానికి 4,075 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు (రిసోర్స్ పర్సన్లు) శిక్షణ ఇచ్చారు. వీరు మండల స్థాయిలో త్వరలోనే ప్రతి పంచాయతీ నుంచి ఒక ఉపాధ్యాయుడు, ఒక వీఓఏకు శిక్షణ ఇస్తారు. వీరు వలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ వలంటీర్లు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిద్దినున్నారు.
46 వేల పుస్తకాలొచ్చాయ్..
గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న సామాజిక చైతన్య కేంద్రాల్లో చదువుకునేవారికి పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచారు. నిరక్షరాస్యుడితో పాటు ప్రతి వలంటీర్కు ఒక పుస్తకం చొప్పున 46 వేల పుస్తకాలు వచ్చాయి. వలంటీర్కు మార్గదర్శి, నిరక్షరాస్యులకు అక్షర వికాసం పుస్తకాలు ఉన్నాయి. ఇందులో పరిసరాలు, ఆర్థిక విషయాలు, నిత్య జీవన చిత్రాలతో కూడిన పాఠాలు ఉంటాయి. చిత్రాల ద్వారా చదువు నేర్పుతారు.
నిరక్షరాస్యులను ఇప్పటికే గుర్తించి వారికి బోధించేందుకు వలంటీర్లను సైతం నియమించాం. త్వరలో గ్రామాల్లో సామాజిక చైతన్య కేంద్రాలను ప్రారంభిస్తాం.
– వై.రాంబాబు, జిల్లా సెక్టోరియల్ అధికారి
15 ఏళ్లు దాటిన నిరక్షరాస్యుల కోసం ‘ఉల్లాస్’
ఫ జిల్లాలో 41,117 మంది గుర్తింపు
ఫ 4,075 మంది వలంటీర్ల నియామకం
ఫ చదువు చెప్పేందుకు త్వరలోనే
సామాజిక చైతన్య కేంద్రాలు