
యూ డైస్ ప్లస్ పై సర్వే
సర్వేను పకడ్బందీగా చేయిస్తాం
విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు డైట్ విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ సర్వే పకడ్బందీగా చేపట్టనున్నాం. మండలస్థాయిలో ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్ ఎంలు, సీఆర్పీలను సమన్వయం చేసుకుంటూ శిక్షణ ఉపాధ్యాయులకు సహకరించాలి. ఈ సర్వేలో ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మౌలిక వసతుల వివరాలను సేకరించనున్నారు.
– అశోక్, డీఈఓ
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నుంచి యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) ప్లస్పై సర్వే నిర్వహించనున్నారు. పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని యూడైస్ ప్లస్లో ప్రధానోపాధ్యాయులు నమోదు చేసిన సమాచారంపై విద్యాశాఖ తొలిసారిగా థర్డ్ పార్టీతో సర్వే చేయిస్తోంది. ఇందుకు డైట్ కళాశాల విద్యార్థులను ఎంపిక చేసింది. ఈ నెల 15 నుంచి 21 వరకు ఎంపిక చేసిన పాఠశాలల్లో వారు వాస్తవ పరిస్థితులను పరిశీలించి ధ్రువీకరిస్తారు. అత్యంత ప్రామాణికమైన ఈ రిపోర్టు ఆధారంగా పాఠశాలలకు బడ్జెట్ కేటాయిస్తున్నందున ఈ సర్వేకు ప్రాధాన్యం సంతరించుకుంది.
జిల్లాలో 885 పాఠశాలల్లో సర్వే
యూడైస్లో నమోదు చేసే వివరాలు అత్యంత గోప్యంగా, ప్రామాణికంగా ఉంటాయి. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు యూడైస్ ప్లస్లో వివరాలను సమగ్రంగా నమోదు చేస్తారు. జిల్లాలో 885 పాఠశాలల్లో సర్వే చేయనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఖాళీల వివరాలు, మౌలిక వసతులు, ఆధార్ అనుసంధానం, మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థులకు యూనిఫాం పంపిణీ, పాఠ్యపుస్తకాల సరఫరా తదితర వివరాలు ఇందులో నమోదవుతాయి. పాఠశాలలో వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మాడ్యూల్స్ గా విభజించి సమాచారం నిక్షిప్తం చేశారు. పాఠశాలలో గదులెన్ని.. ఇంకా ఏమేం అవసరం.. ఫర్నిచర్, ల్యాబ్, ఇతర సదుపాయాలు ఉన్నాయా అమలవుతున్న కార్యక్రమాలు ఇందులో ఉంటాయి.
89 మంది డైట్ కళాశాల విద్యార్థులతో..
పాఠశాల విద్యా వ్యవస్థ ప్రామాణికతను అందించే రిపోర్టు ఇది. ఈ రిపోర్టుపై సర్వే చేసేందుకు నల్లగొండ డైట్ కళాశాల విద్యార్థులను 89 మందిని ఎంపిక చేశారు. వీరికి రెండు రోజుల క్రితమే డైట్లో శిక్షణ కూడా ఇచ్చారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి 21 వరకు రోజూ రెండు పాఠశాలల చొప్పున సర్వే చేస్తారు. ఒక్కొక్కరికి 10 పాఠశాలలను అప్పగించారు. తొలుత పాఠశాల రిపోర్టు కార్డు ఆధారంగా పరిశీలిస్తారు. పాఠశాలల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు, వివరాలన్నీ యూడైస్లో ప్రధానోపాధ్యా యులు నమోదు చేశారా.. విద్యార్థుల సంఖ్య, సౌకర్యాలు ఏ మేరకు ఉన్నాయనేది రిపోర్టులో నమోదు చేసిన వివరాల ద్వారా భౌతికంగా పరిశీలించి ధ్రువీకరిస్తారు. తప్పులుంటే సరి చేయాలని ప్రధానోపాధ్యాయులకు రిమార్క్ రాసి ఇస్తారు. వాటిని అదే రోజు సీఆర్పీల సహకారంతో సరి చేయాల్సి ఉంటుంది. ఈ సర్వేను విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.
ఫ నేటి నుంచి 21వ తేదీ వరకు నిర్వహణ
ఫ సర్వే చేయనున్న 89 మంది డైట్ కళాశాల విద్యార్థులు
ఫ ఒక్కో విద్యార్థికి రోజుకు రెండు
స్కూళ్ల చొప్పున పరిశీలన బాధ్యత