
ఉద్యాన సాగుకు ఔట్సోర్సింగ్ సేవలు
నాగారం : జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సంప్రదాయ పంటలతో నష్టాలు వస్తున్నాయని కొందరు రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లుతున్నారు. అయితే ఉద్యాన పంటలు సాగు చేసే వారికి సలహాలు, సూచనలిచ్చే అధికారులు, సిబ్బంది అరకొరగా ఉన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు ఇబ్బందులు తప్పనున్నాయి.
ప్రస్తుతం ఐదుగురు మాత్రమే..
జిల్లాలో రైతులు సమారుగా 36,559 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు. పండ్ల తోటలు 15,846 ఎకరాల్లో, కూరగాయలు 813 ఎకరాల్లో. మిర్చి 14,917 ఎకరాలు, ఆయిల్పామ్ 4,885 ఎకరాల్లో సాగవుతుంది. తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, పెన్పహాడ్, మోతె, సూర్యాపేట, నడిగూడెం, తిరుమలగిరి, నూతనకల్, ఆత్మకూర్ తదితర మండలాల్లో ఉద్యాన పంటలు అధికంగా సాగుచేస్తుంటారు.
మొలకెత్తింది మొదలు పంట చీడపీడల నివారణకు జాగ్రత్తలు పాటించాలి. మెరుగైన దిగుబడులు, గిట్టుబాటు ధర దక్కేలా రైతులను సరైన బాటలో నడిపించేది క్షేత్రస్థాయి సిబ్బందే. జిల్లాలో 23 మండలాలు ఉండగా ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉద్యాన అధికారులు ఉన్నారు. జిల్లాలో హుజూర్నగర్, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, మేళ్లచెరువు మండలాలకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ఒక్కో ఉద్యానాధికారి మూడు, నాలుగు మండలాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. దీంతో ఉద్యాన అధికారులపై అదనపు భారం పడుతోంది. పొరుగు సేవల సిబ్బంది విధుల్లో చేరితే సలహాలు, సూచనలు త్వరితగతిన అందించేందుకు వీలుంటుంది. మూడేళ్ల కిందట ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించగా వారిని తిరిగి చేర్చుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తొమ్మిది మంది సిబ్బంది వచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి
ప్రభుత్వ ఆదేశాలు వస్తే జిల్లాలో ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమిస్తాం. ఈమేరకు సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రతిపాదనలు ఇప్పటికే పంపించాం.
– నాగయ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, సూర్యాపేట
ఫ సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు
ఫ అన్నదాతలకు తప్పనున్న ఇబ్బందులు
జిల్లాలో సాగు విస్తీర్ణం
(ఎకరాల్లో..)
పండ్ల తోటల సాగు 15,846
కూరగాయలు 813
మిర్చి 14,917
ఆయిల్పామ్ 4,885
ఇతర పంటలు 95
మొత్తం 36,559

ఉద్యాన సాగుకు ఔట్సోర్సింగ్ సేవలు