● సూటిగా ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకులు కుంభా రవిబాబు
● ‘చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు’ పుస్తకం, పోస్టర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ‘నేను ఆర్థిక సంస్కర్తను.. సంపద ఎలా సృష్టించాలో నాకు తెలుసు’ అని గత ఎన్నికల సందర్భంగా చెప్పిన చంద్రబాబు ఆ మాట లు గాలికి వదిలేశారని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు కుంభా రవిబాబు అన్నారు. సూపర్ సిక్స్ పేరిట అనేక అబద్ధపు హామీలిచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయడం చేతకాని నీకా ప్రజ లు ఓటేసి గెలిపించారు అని మండిపడ్డారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు’ అనే పుస్తకం, పోస్టర్ని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ సూపర్ సిక్స్.. సూపర్ సక్సెస్ పేరిట సంబరాలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. 40 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఏడాదికి 10 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఒక్క నిరుద్యోగికై నా రూపాయి ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రూ.4వేలు పెన్షన్ అని మోసగించారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2024 ఎన్నికల నాటికి 66.34లక్షల మందికి పెన్షన్లు ఇస్తే కూటమి ఆ పెన్షన్లను 60.14లక్షల మందికి తగ్గించేసిందని తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రెండేళ్లలో రూ 3.54 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదని పేర్కొన్నారు. సంపద సృష్టించి సంక్షేమం ఇస్తామన్న పెద్ద మనిషి చంద్రబాబు ముగ్గురు పిల్లల్ని కనండి రూ.30వేలు ఇస్తా, నలుగురుని కనండి రూ.40వేలు ఇస్తానని చెప్పడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వ మోసాల్ని ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన బాధ్యత వైఎస్సార్ సీపీ శ్రేణులపై ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం, వైఎస్సార్సీపీ మహిళావిభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఎంవీ పద్మావతి, కాళింగకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు దుంపల లక్ష్మణరావు, తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, కళింగవైశ్య కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, వెలమకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు కేవీజీ సత్యనారాయణ, రాష్ట్రకార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, ఆమదాలవలస నియోజకవర్గ పరిశీలకులు కరిమి రాజేశ్వరరావు, టెక్కలి నియోజకవర్గ పరిశీలకులు చల్ల రవికుమార్, తమ్మినేని చిరంజీవినాగ్ (నాని), ఎస్ఈసీ మెంబర్లు గొండు కృష్ణమూర్తి, చల్ల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ రుప్ప దివ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ముత్తా విజయ్కుమార్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి జి.పురుషోత్తంలతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు సాధు వైకుంఠరావు, గద్దిబోయిన కృష్ణయాదవ్, వి.మన్మధరావు, సీపాన రామారావు, కింజరాపు రమేష్, తంగి అప్పన్న స్వామి, టి.నాగేశ్వరరావు, కోణార్క్ శ్రీను, చీమల తారక్ పాల్గొన్నారు.


