● వైఎస్సార్ సీపీ ఆమదాలవలస
సమన్వయకర్త చింతాడ రవికుమార్
ఆమదాలవలస: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మతిభ్రమించిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై చేసిన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరన్నారు. కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీలో ఉనికి కోసమే ఇలా చేస్తున్నారని, వైఎస్సార్ సీపీ నాయకులతో తిట్టించుకుంటే మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దివంగత ఎన్టీఆర్ మరణం వెనుక కారణం ఎవరో ఈ దేశం మొత్తం చెప్పగలదనే విషయం గుర్తుంచుకోవాన్నారు. కూన రవికుమార్కు చేతనైతే టీడీపీలో ఈనాటికీ అనుమానాలు ఉన్న వంగవీటి రంగా, కింజరాపు ఎర్రన్నాయుడు, ఎలిమినేటి మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి, జీఎంసీ బాలయోగిల మరణాలపై చంద్రబాబు వద్దకు వెళ్లి అడిగి తెలుసుకోవాలని హితవుపలికారు.
తమ నేతలు జగన్మోహన్ రెడ్డి, దివంగత రాజశేఖరరెడ్డిలు ప్రజల హృదయాలు గెలుచుకొని నాయకులు అయ్యారని, మీ నాయకుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యాడని, ఇది ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసని పేర్కొన్నారు. మీ యువ నాయకుడు లోకేష్ త్వరలోనే నాన్నకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నాడని విమర్శించారు. కూన రవికుమార్ చేసే చీకటి వ్యాపారాలు నియోజకవర్గ ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. కూన కేకలకు బెదిరే వారు లేరని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, పార్టీ ముఖ్య నాయకులు సురవరపు నాగేశ్వరరావు, బోర చిన్నంనాయుడు, పొడుగు శ్రీనివాసరావు, బెవర మల్లేశ్వరరావు, దుంపల శ్యామలరావు, పొన్నాడ చిన్నారావు, మొండేటి కూర్మారావు, సంపతిరావు రామారావు, పున్నపురెడ్డి తవిటినాయుడు, బొడ్డేపల్లి మన్మధరావు, బొడ్డేపల్లి వెంకటరమణ, పొదిలాపు తిరుపతిరావు, సత్యనారాయణ, మెట్ట వసంతరావు, అన్నపు కృష్ణ, ప్రసాద్, అన్నపు సంజయ్ తదితరులు పాల్గొన్నారు.


