● లెవీ బియ్యంలో రేషన్ బియ్యం కలుపుతున్నట్లు నిర్ధారణ ● 160 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం
నరసన్నపేట: సివిల్ సప్లయ్కు ఇస్తున్న లెవీ బియ్యంలో రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేసి కలుపుతు న్నట్లు నిర్ధారణ కావడంతో నరసన్నపేట మండలం మడపాం వద్ద శ్రీ వేంకటేశ్వర మోడరన్ రైస్మిల్లును అధికారులు శనివారం సీజ్ చేశారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో సివిల్ సప్లయ్ డీఎం వేణుగోపాలరావు, డీఎస్ఓ సూర్యప్రకాశరావులు శుక్ర, శనివారాల్లో రైస్మిల్లును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్ఓ మాట్లాడుతూ మిల్లులో 160 కేజీల రేషన్ బియ్యాన్ని గుర్తించామన్నారు. లెవీ బియ్యంలో రేషన్ బియ్యం కలుపుతున్నట్లు నిర్ధారణ కావ డంతో జేసీ ఆదేశాల మేరకు మిల్లుపై సిక్స్ ఎ కేసు నమోదు చేసి సీజ్ చేస్తున్నామని ప్రకటించారు. కొంతకాలంగా ఈ మిల్లు నుంచి సివిల్ సప్లయ్కు వస్తున్న లెవీ బియ్యంలో కోటా బియ్యం కలుపుతున్నట్లు అనుమానం వచ్చి నిపుణులతో పరిశీలన చేయించగా వాస్తవమని నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో మిల్లులో ఉన్న 1200 టన్నుల ధాన్యాన్ని సమీపం మిల్లులకు తరలిస్తున్నామని డీఎస్ఓ వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి మిల్లులపై నిఘా వేస్తున్నామని చెప్పారు. పీడీఎస్ బియ్యం మిల్లుల్లో ఉంటే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీఎస్ఓ వెంట తహసీల్దార్ సత్యనారాయణ, సీఎస్డీటీ రామకృష్ణ తదితరులు ఉన్నారు.


