కవిటి : సమకాలీన సమాజంలో కుటుంబ వ్యవస్థలో నెలకొన్న పలు ప్రతికూల అంశాల్ని కళ్లకు కట్టినట్టు తెరకెక్కించిన నాటిక ప్రదర్శనలు ప్రేక్షకుల్ని ఆద్యంతం చైతన్యపరిచాయి. కవిటి మండలం బొరివంకలో కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో రెండో రోజు జరిగిన ఉభయ తెలుగురాష్ట్రాల నాటిక పోటీ లు ఆలోచింపజేశాయి. అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించిన ‘సహాన’ నాటిక ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అన్యాయంపై తిరుగుబాటు చేస్తూ అలుపెరుగని ప్రయాణం చేయాలనే ఇతివృత్తంగా సా గింది. రెండో ప్రదర్శనగా ‘మా ఇంటి మహాభారతం’ నాటికలో వంద ఎకరాల భూస్వామి విలాసా ల బారిన పడి ఉన్నదానిలో అరవై ఎకరాలు అమ్ము కోవడం, తల్లి శపథం ఇతివృత్తంగా ఆద్యంతం అలరించింది. చివరి ప్రదర్శనగా ఆలీతో సరదాగా అనే హాస్యనాటిక సమాజంలో యువతీ యువకుల మధ్య ఆధునిక స్నేహసంబంధాల్లో వస్తున్న తాజా సన్నివేశాల సమాహారంగా తెరకెక్కించారు.


