● రాజకీయ కక్షతో పింఛన్లు నిలిపివేత
పొందూరు: మండలంలోని గోకర్నపల్లి గ్రామంలో రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఏడుగురి పింఛన్లను అధికారులు నిలుపుదల చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎన్ని రామారావు, సంపతిరావు వేదాంతినాయుడు, గురుగుబెల్లి బంతమ్మ, సీపాన సూర్యనారాయణ, యారబాటి దాలయ్య, సంపతిరావు నేపాలరాజు, పాతిన జగన్నాథంలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ తీసుకునేందుకు అనర్హులని ఈ ఏడాది జనవరి 3వ తేదీన ఎంపీడీవో వాసుదేవరావు నోటీసులు జారీ చేశారు. నోటీసు ప్రాప్తికి వారంతా జనవరి 9వ తేదీన ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఉంది. ఈ మేరకు వీరు గోకర్నపల్లి సచివాలయంలో విచారణకు హాజరైయ్యారు. పంచాయతీ కార్యదర్శి వీరి సంతకాలు తీసుకున్నారు. ఎంపీడీవో మాత్రం హాజరుకాలేదు. అయితే వీరు అక్రమంగా పింఛన్లు పొందుతున్నారని జనవరి నెలాఖరున ఎంపీడీవో విచారణ జరిపి, ఫిబ్రవరి నుంచి నిలుపుదల చేశారు. వారిలో గురుగుబెల్లి బంతమ్మకు రూ.75లు ఉన్నప్పటి నుంచి పింఛన్ వస్తుండడం గమనార్హం. మిగిలినవారంతా వృద్ధాప్య పింఛన్ రూ.1000లు ఉన్నప్పటి నుంచి పింఛన్ తీసుకుంటున్నారు. వీరంతా అర్హులైనప్పటికీ రాజకీయ కారణాలతో పింఛన్లు తొలగించారని వాపోతున్నారు. దీనిపై ఎంపీడీవో మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్ ఇచ్చిన నివేదిక మేరకు తాత్కాలికంగా పింఛన్లు నిలిపివేయడం జరిగిందన్నారు.


