శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కార్మికవర్గాన్ని యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ఐక్య పోరాటాలు తీవ్రతరం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి క్రాంతి, ఎస్.కృష్ణవేణిలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలుకు నిరసనగా బ్లాక్ డే నిర్వహించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా 29 కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరుతూ ఆల్ ట్రేడ్ యూనియన్, ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళం అంబేడ్కర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక వర్గం ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కడం దారుణమన్నారు. కార్మిక మంత్రిత్వశాఖ ఇక నుంచి యాజమాన్యాల మంత్రిత్వ శాఖగా మారబోతున్నదని, యాజమాన్యాల శ్రమ దోపిడీకి రహదారులను మోడీ ప్రభుత్వమే సిద్ధం చేస్తోందని విమర్శించారు. ఇటువంటి చర్యలు వీడకుంటే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు ఎన్వీ రమణ, ఎం.ఆదినారాయణమూర్తి, ఎం.గోవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు.


