శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని మాజీ సైనికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ‘నల్సా వీర్ పరివార్ సహాయత యోజన–2025’ పథకం పనిచేస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక సైనిక్ బోర్డును సందర్శించి అక్కడి పరిస్థితులపై చర్చించారు. దేశ సేవలో తరించిన మాజీ సైనికులు తమ న్యాయపరమైన చిక్కులను వదిలించుకునేందుకు ఈ పథకం ఒక చక్కని వేదిక అని ఆయన పేర్కొన్నారు. సైనిక సంక్షేమ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ క్లినిక్ ద్వారా ప్యానెల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లు నిరంతరం అందుబాటులో ఉంటారని వివరించారు. మాజీ సైనికులు తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎ.శైలజ, ప్యానెల్ అడ్వకేట్ వి.జ్యోతిర్మయి, ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.


