● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● పీజీఆర్ఎస్కు 113 అర్జీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు 113 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్కు సంబంధించి 58 అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ 24, పంచాయతీ రాజ్ 17, వ్యవసాయ శాఖ 5, పేదరిక నిర్మూలన సంస్థ 16, మున్సిపల్ కార్పొరేషన్ 11, సర్వే అండ్ లాండ్ రికార్డులు 8, సర్వే 9, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 7 తదితర శాఖలకు సంబంధించి 113 అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించినవారిలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీఏ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పలు వినతులు పరిశీలిస్తే..
పొందూరు మండలంలోని లోలుగు రెవెన్యూ పరిధిలో ఉన్న డీజీఆర్ జ్యూట్మిల్ ప్రైవేట్ లిమిటెడ్ మిషనరీ అక్రమ అమ్మకాలపై అధికారులు కోరిన సమాచారం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీవీ రమణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకొని తనకు వివరాలు అందజేయాలని కోరారు.
● శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ప్రశాంతి వృద్ధాశ్రమం వెనుక కలెక్టర్ ఆఫీసు రోడ్డులో డీటీసీపీ అప్రూవల్ పొందిన లేఅవుట్ శ్రీసాయి శ్రీనివాసనగర్ నివాసాల మీదుగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు సిద్ధం చేశారని, ఆ ప్లాన్ రద్దు చేయాలని శ్రీసాయినగర్ వాసులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. దీనివలన సుమారు 200 కుటుంబాలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.


