స్నేహితుడి ఇంటికే కన్నం
● చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
పలాస: కాశీబుగ్గ రోటరీనగర్లోని సునీత పాత్రో ఇంట్లో ఈ నెల 7న జరిగిన చోరీ కేసులో కాశీబుగ్గ పోలీసులు ఇద్దరు నిందితులు తెల్లి దీనబందు, టెంకు నాగరాజులను అరెస్టు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహబాద్ అహ్మద్ సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. సునీత పాత్రో భర్త బతుకు తెరువు కోసం చైన్నె వలసపోయాడు. ఇతనితో దీనబంధు అనే వ్యక్తి కలిసి ఎలక్ట్రికల్ పనులు చేసేవాడు. ఆ సమయంలో అతని ఇంటికి వెళ్తుండేవాడు. సునీత కాశీబుగ్గలోని ఓ షోరూమ్లో పనిచేస్తున్నారు. దీనబంధుకు ఆర్థిక అవసరాల నిమిత్తం డబ్బు అవసరం ఏర్పడింది. దీంతో సునీత ఇంట్లో బంగారు ఆభరణాలు ఉండటం గమనించి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శనివారం సునీత ఇంటి తాళాన్ని చాకచక్యంగా సంపాదించాడు. ఓ షాపులో పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి వద్దకు వెళ్లి ఇంట్లో బీరువా రిపేరు ఉందంటూ సునీత ఇంటికి తీసుకెళ్లాడు. బీరువాలో బంగారు ఆభరణాలు ఉన్నాయని, వాటిని తీసుకెళ్లి అమ్ముకుంటే డబ్బులు వస్తాయని, అందులో సగం వాటా ఇస్తానని చెప్పాడు. అనంతరం సుత్తితో బీరువా తెరిచి రూ.7.50 లక్షలు విలువైన ఆరు రకాల బంగారు అభరణాలు అపహరించుకుపోయారు. బాధితురాలు సునీత ఇంటికి వచ్చి చూడగా చోరీ జరగడాన్ని గమనించి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి కాశీబుగ్గ బంకేశ్వరగుడి సమీపంలో ఒకరిని, జి.ఎం.ఇ కాలనీ వద్ద ఒక షాపు వద్ద మరొకరిని అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పలాస కోర్టులో సోమవారం హాజరుపరిచారు. కేసును ఛేదించిన కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


