జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 12 నుంచి మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాలలో జాబ్ క్యాలెండర్పై ప్రకటన చేయాలని, నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి రెండేళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు హామీలను నిలబెట్టుకోలేదన్నారు. నిరుద్యోగ భృతి ఊసేలేదన్నారు. నెలకు పదివేల రూపాయలు భృత కల్పిస్తామని చెప్పిన కూటమి నాయకులు ఏకంగా వాలంటీర్ వ్యవస్థనే తొలగించారని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుంటే మంత్రులు, కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వై.వేణు, ఏఐవైఎఫ్ నాయకులు వసంతరావు, అన్నాజీ, శ్రీనిధి, ఉపేంద్ర, రామోజీ, రామమూర్తి, రమేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


