బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సోంపేట: సోంపేట పట్టణానికి చెందిన తెల్లి అవినాష్ (23) అనే యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోంపేట పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తెల్లి యోగేశ్వరరావు, రోహిణిల కుమారుడు అవినాష్ బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతుండగా మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కాలికి తీవ్ర గాయాలు కావడంతో నడవ లేని పరిస్థితి ఎదురైంది. మూడు శస్త్ర చికిత్సలు జరిగినా నయం కాలేదు. చదువు మధ్యలో ఆగిపోవడం, నడవలేని పరిస్థితి కావడంతో నిత్యం ఆందోళన చెందుతుండేవాడు. కుటుంబానికి భారం కాకూడదని ఆదివారం వేకువజామున ఇంటికి సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరికి అవినాష్తో పాటు డిగ్రీ చదువుతున్న మరో కుమారుడు ఉన్నాడు. సోంపేట ఎస్ఐ వి.లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ
మహిళ మృతి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వడ్డాణ జయలక్ష్మి(40) అనే మహిళ మూడు రోజుల క్రితం ఒంట్లో నీరసమంటూ చేరింది. చికిత్స పొందుతూ ఆదివారం
మృతిచెందింది. ఈమెకు తోడుగా ఎవరూ రాలేదని, తనది శ్రీకాకుళం బరాటం వీధి అని చెప్పినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు తెలిసిన వారు 6309990842 నంబరును సంప్రదించాలని ఎస్ఐ ఎం.హరికృష్ణ కోరారు.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య


