కొండకు గుండెకోత
వీఆర్ గూడెం కొండపై గ్రావెల్ బకాసురులు
● అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్న వైనం
● ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలు జరిపి క్రషర్లలో విలీనం
● రోజుకు 200 టిప్పర్లు లోడు రవాణా
వీఆర్ గూడెం కొండపై గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న దృశ్యం
పొందూరు: అధికార పార్టీ అండతో కొందరు కొండలకు గుండు కొట్టేస్తున్నారు. గ్రావెల్ కోసం, మట్టి కోసం కొండలను, చెరువులను తవ్వేస్తున్నారు. పొందూరు మండలం అక్రమ క్వారీలకు నిలయమని జిల్లా వాసులకు తెలిసిందే. కానీ గ్రావెల్తోనూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ గ్రావెల్ రవాణా వల్ల రహదారులు ఛిద్రమై ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతోంది.
కొండపై భారీ తవ్వకాలు
వీఆర్ గూడెం సమీపాన సుమారు 400 ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం గ్రావెల్తో కూడుకున్న కొండలే. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పైడి కొండ గ్రావెల్తో నిండి ఉంది. వీటిని తమకు అనుకూలంగా మలచుకున్న లోలుగు, వీఆర్ గూడెం, పొందూరు గ్రామాలకు చెందిన అధికార పార్టీ నాయకులు గ్రావెల్ తవ్వకాలతో రెచ్చిపోతున్నారు. పదుల ఎకరాల్లో రోజూ గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. ఒక్క వీఆర్ గూడెం కొండపైనే మూడు నాలుగు ప్రాంతాల్లో గ్రావెల్ తవ్వకాలు చేపడుతూ సుమారు 200 వందల టిప్పర్లు, వంద ట్రాక్టర్లతో జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు రోజూ తరలిస్తున్నారు. కొంత మంది రైల్వే కాంట్రాక్టర్లు, రోడ్డు కాంట్రాక్టర్లు సైతం మట్టిని తరలిస్తున్నారు.
రహదారులుగా జీడి తోటలు
గ్రావెల్ మాఫియా కారణంగా జీడి మామిడి తోటలు కనుమరుగవుతున్నాయి. గ్రావెల్ తరలించడానికి ఈ తోటల నుంచే రహదారులు వేయడానికి వేల సంఖ్యలో చెట్లను కొట్టేశారు. అడిగిన రైతులను అధికార పార్టీ అండతో బెదిరిస్తున్నారు. కొండలపై ఉన్న సామాజిక అడవులను ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఫారెస్టు అధికారులు సైతం గ్రావెల్ మాఫియాకే వత్తాసు పలుకుతున్నారని జీడి తోటల యజమానులు వ్యక్తం చేస్తున్నారు.
గ్రావెల్ తవ్వి క్రషరీల్లో విలీనం
వీఆర్గూడెం కొండపై గ్రావెల్ మైనింగ్ చేయడమే కాకుండా, చదును చేస్తున్న స్థలాలను క్రషర్లలో విలీనం చేసుకుంటున్నారు. కొండకు సమీపంలో ఓ టీడీపీ నాయకుడు తన క్రషర్లో సుమారు రెండు ఎకరాల స్థలంలో వేల టిప్పర్ల మట్టిని తరలించడమే కాకుండా సంబంధిత స్థలాన్ని తమ క్రషర్లో విలీనం చేసుకున్నాడు. రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్న భారీ వాహనాల కారణంగా మండలంలోని పొందూరు నుంచి చిలకపాలెం వరకు ఉన్న రాష్ట్ర ప్రధాన రహదారి గుంతల మయంగా తయారైంది. ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే ఏడుగురు ప్రయాణికులు మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.
చోద్యం చూస్తున్న అధికారులు
మండలంలో భారీ స్థాయిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ రవాణా జరుగుతున్నా తమకెందుకులే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. దీని కారణంగా మాఫి యా వ్యక్తులు అధికార పార్టీకి చెందిన వారేన న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రావెల్ మా ఫియా ఎవరు చేయిస్తున్నారోనని అధికారులు కనీసం చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నా రు. ఈ వాహనాల కారణంగా రోడ్లు మరమ్మతులకు గురవుతున్నా ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా రు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం
వీఆర్ గూడెం, పైడికొండపై గ్రావెల్ తవ్వకాలు జరగడంపై ఫిర్యాదుల వచ్చాయి. పైడికొండ తవ్వకాలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. వీఆర్గూడెం కొండపై భారీ స్థాయిలో జరుగుతుండటంతో మైనింగ్ అధికారులతో పాటు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. చర్యలు తీసుకుంటాం.
– వెంకటేష్ రామానుజుల, తహసీల్దార్, పొందూరు
ఈ అక్రమాలతో అధికార పార్టీ నాయకులు భారీగానే దండుకుంటున్నారు. పార్టీ బల మే అండగా భారీ వసూలుకు పాల్పడుతున్నా రు. టిప్పర్కు రూ.600 నుంచి రూ.800లు వసూలు చేస్తుండగా రోజుకు కనీసం 200 టిప్ప ర్లు రెడ్డిపేట, లోలుగు, వీఆర్ గూడెం మీదుగా తరలిస్తున్నారు. ట్రాక్టర్కు రూ.200 వసూలు చేస్తున్నారు. దీంతో గ్రావెల్ మాఫియాకు రోజుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతుండటంతో కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. వీఆర్గూడెం, పొందూరు పైడికొండపై ఎకరాల మేర తవ్వకాలు సాగుతున్నాయి.
కొండకు గుండెకోత
కొండకు గుండెకోత
కొండకు గుండెకోత


