
‘సిమ్’పుల్గా కొట్టేస్తున్నారు
● వణికిస్తున్న ఈ–సిమ్ స్కామ్
● జిల్లాలో పెరుగుతున్న బాధితుల సంఖ్య
అప్రమత్తంగా ఉండాల్సిందే..
నెట్వర్క్ ప్రొవైడర్ అంటూ వచ్చే ఫేక్ మెసేజ్లు, ఏపీకే లింక్లు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకండి. కంపెనీలు ఇలాంటివి పంపవని గ్రహించాలి. హఠాత్తుగా మన సిమ్ నెట్వర్క్ ఆగిపోతే స్కామ్ అని అనుమానించాల్సిందే. వెంటనే సమీ పంలో ఉండే మీ అకౌంట్లున్న బ్యాంకును సంప్రదించి గానీ బ్యాంక్ కస్టమర్కేర్లో గానీ సమస్య నివే దించి అన్నీ ఫ్రీజ్ చేయించాలి. సిమ్ నెట్వర్క్ కంపెనీని కూడా సంప్రదించాలి.
– సీహెచ్ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం
సోంపేటలోని ఓ బ్యాంకు మేనేజర్ ఫోన్ సడెన్గా పనిచేయడం మానేసింది. నెట్వర్క్ సిగ్నల్ ఫెయిల్ అని చూపించింది. అక్కడకు కొద్ది గంటల్లోనే తన ఖాతాలో ఉన్న సొమ్ము మాయమైంది. ఐదు రోజుల్లో దాదాపు రూ. 22 లక్షల వరకు మాయమయ్యాయి.
కాశీబుగ్గలో సైతం ఓ బ్యాంకు మేనేజరే తన ఫోన్కొచ్చిన లింక్ క్లిక్ చేశారు. అక్కడికి ఒక రోజు ఆగాక తన సిమ్ బ్లాక్ అయ్యింది. సిమ్ కంపెనీ నెట్వర్క్ ప్రొవైడర్ వద్దకు వెళ్తే ఎం–ఆధార్లో ఆయన బయోమెట్రిక్ లాక్ అయ్యిందని తెలిసింది. వారం రోజుల్లో దాదాపు రూ.14 లక్షల సొమ్ము పోయింది.
శ్రీకాకుళం క్రైమ్ :
జిల్లాలో కొత్త తరహా స్కామ్ వెలుగు చూస్తోంది. ‘ఈ–సిమ్’ స్కామ్పై కొద్ది రోజుల్లోనే జిల్లాలో 15కుపైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో కొందరు పోలీసులను ఆశ్రయిస్తుండగా..మరికొందరు భయపడి మిన్నకుండిపోతున్నారు. మోసపోయిన అందరి సిబిల్ స్కోర్ బాగుండటం విశేషం.
అసలు ఏంటీ ఈ–సిమ్..?
● ఈ–సిమ్.. అంటే ఎలక్ట్రానిక్ సిమ్. ఫీచర్లు ఎక్కువ ఉండే ఐఫోన్ ఇతరత్రా ఫోన్లలో ఈ–సిమ్లనే వాడుతారు.
● మన ఫోన్లో ఉండే సాధారణ సిమ్ల స్థానంలోనే ఈ–సిమ్ యాక్టివేషన్ అంటూ వాట్సాప్, ఇన్స్ర్ట్రాగామ్, ఇతర మాధ్యమాల ద్వారా నేరస్తులు ఓ లింక్ పంపుతారు.
● ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే సైబర్ నేరస్తుల మెయిల్ ఐడీకి మన సిమ్ నంబర్ లింక్ అవు తుంది. ఓటీపీ వస్తుంది చెప్పండంటూ తక్షణమే వారి నుంచి ఫోన్ వస్తుంది.
● ఓటీపీ చెప్పిన వెంటనే మన ఫోన్లో ఉన్న ఫిజికల్ సిమ్ వారి ఫోన్లో ఉండే ఈ–సిమ్ నంబర్గా యాక్టివేట్ అయిపోతుంది. కొన్నిసార్లు ఓటీపీ అవసరం లేకుండానే ఇదంతా జరుగుతుంది.
● ఈ–సిమ్గా యాక్టివేట్ అయ్యాక మన వద్ద ఉండే సిమ్ నెట్వర్క్ ఆగిపోతుంది. ఫోన్ నంబర్తో లింక్ అయ్యే ఆధార్ కార్డు ఉంటుంది కాబ ట్టి ఎం.ఆధార్ యాప్లోకి వెళ్లి ఓటీపీల ద్వారా బయోమెట్రిక్ లాగిన్ ఓపెన్ చేసి మన ఆధార్ నంబర్ను లాక్ చేసేస్తారు.
సమాచారమంతా వారి గుప్పిట్లోకే..
ఒక్కసారి ఈ–సిమ్ యాక్టివేట్ అయితే సమాచారం అంతా వారి గుప్పిట్లోకి వెళ్లిపోతుంది. బ్యాంకు లావాదేవీల ఓటీపీలన్నీ వారికే వెళ్తాయి. వారికి ఇక పాస్వర్డులు, ఏటీఎం కార్డు వివరాల అవసరం ఉండదు. సులభంగా బాధితుల ఖాతాల నుంచి సొ మ్మును లాగేస్తారు. మోసం గ్రహించి నెట్వర్క్ ప్రొవెడర్ వద్దకు వెళ్తే వారం రోజులకు గానీ పని అవ్వదు. ఈలోగా ఖాతా ఖాళీ చేసేస్తారు.

‘సిమ్’పుల్గా కొట్టేస్తున్నారు

‘సిమ్’పుల్గా కొట్టేస్తున్నారు