
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చేతివాటం
● ఎరువుల పేరిట రైతుల వద్ద డబ్బులు వసూలు
● 25 మందికి పింఛనూ ఇవ్వని వైనం
● విచారణ చేపట్టిన ఏడీ
ఎరువుల కోసం డబ్బులిచ్చా..
ముందుగా డబ్బులు ఇస్తే యూరి యా, డీఏపీ తెప్పిస్తానని డబ్బులు కట్టమంటే ఇచ్చాం. 15 రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ ఎరువు ఇవ్వలేదు. అడిగితే ఇదుగో అదిగో అని వాయిదాలు వేస్తున్నారు.
– చిన్నమ్మడు, చింతువానిపేట
పింఛన్ ఇవ్వలేదు..
పింఛన్ కోసం ఎదురు చూస్తున్నాం. సచివాలయం చుట్టూ తిరిగాం.మూడు రోజుల నుంచి తిప్పించుకుంటున్నా డబ్బులు ఇవ్వలేదు. తీరా బుధవారం మా పింఛన్ డబ్బు సచివాలయం ఉద్యో గి తినేశాడని అంటున్నారు. మా పింఛన్ మాకు ఇప్పించండి.
– ఆదెమ్మ, మహలక్ష్మి, కళావతి, పింఛన్ లబ్ధిదారులు
నరసన్నపేట: ఉర్లాం సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గొల్లపల్లి భాస్కరరావు చేతివాటం చూపడంతో అటు రైతులు, ఇటు పించనుదారులు లబోదిబోమంటున్నారు. ఉర్లాంకు ఇటీవలే బదిలీపై వచ్చిన భాస్కరరావు వచ్చినప్పటి నుంచి తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని, కేర్ ఆసుపత్రిలో జాయిన్ చేశామని, డబ్బులు అవసరమంటూ స్థానికుల వద్ద రూ.రెండు లక్షలకు పైగా అప్పులు చేసినట్లు సమాచారం. యూరియా, డీఏపీ ఇస్తామని చెప్పి 110 మంది రైతుల నుంచి రూ.1,92,820 వసూలు చేశాడు. 15 రోజులైన ఎరువులు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజావీధి, చెరువు గట్టుపై ఉన్న 61 మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు పంచాయతీ కార్యదర్శి రవికుమార్ ఆగస్టు 31న రూ.2.52 లక్షలు ఇచ్చారు. అయినా పింఛన్లు పంపిణీ చేయలేదు. కొందరు వృద్ధుల నుంచి వేలిముద్రలు వేయించుకుని డబ్బులు ఇవ్వలేదు. వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లడంతో బుధవారం ఉదయం 36 మందికి ఆదరాబాదరగా పింఛన్లు పంపిణీ చేశారు. మిగిలిన 25 మందికి ఇవ్వాల్సిన రూ.1,21,000 తన వద్ద లేవని, ఖర్చయిపోయాయని చెప్పడం గమనార్హం.
ఈ మొత్తం కట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో సమయం కోరినట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తుండటంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది.
ఎరువు ఇస్తామని వసూలు..
ఉర్లాం ఆర్ఎస్కే పరిధిలోని రైతుల వద్ద 440 యూరియా బస్తాలు, 50 డీఏపీ బస్తాలకు రూ.1.92,820 లక్షలను భాస్కరరావు వసూలు చేశాడు. యూరియా బస్తాకు రూ.280 చొప్పున, డీఏపీ బస్తాకు రూ.1370 చొప్పున వసూలు చేశాడు. అందరికీ చేతి రసీదులు ఇచ్చారు. వీటిని పట్టుకొని రైతులు ప్రతిరోజూ ఆర్ఎస్కే, సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో బాధిత రైతులు స్థానిక వ్యవసాయ శాఖ ఏడీ మధు దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఆయన ఉర్లాం చేరుకొని సర్పంచ్ పోలాకి నర్శింహమూర్తి, మాజీ సర్పంచ్ జల్లు చంద్రమౌళి, గ్రామస్తుల సమక్షంలో విచారణ చేపట్టారు. రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు భాస్కరరావు అంగీకరించాడు. దీంతో తమకు ఎరువులు ఇప్పించాలని, లేదా డబ్బులైనా వాపసు చేయాలని రైతులు కోరారు. కాగా శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి నివేదిక పంపనున్నట్లు ఏడీ తెలిపారు.

విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చేతివాటం

విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చేతివాటం

విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చేతివాటం