
కేసులు పెడితే దోషులవుతారా?
● మాజీ మంత్రి ధర్మాన ధ్వజం
● ఎంపీ మిథున్రెడ్డితో ములాఖత్
సాక్షి, రాజమహేంద్రవరం/శ్రీకాకుళం:
కూటమి ప్రభుత్వం ఎంపీ మిథున్రెడ్డిని దోషిగా ప్రచారం చేస్తోందని, ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్రెడ్డితో మాజీ మంత్రి ధర్మాన బుధవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట ధర్మాన మీడియాతో మాట్లాడారు. ఎంపీ మిథున్రెడ్డిపై కేవలం కొన్ని ఆరోపణలు మాత్రమే వచ్చాయన్నారు. న్యాయవ్యవస్థ దోషి అని నిర్ధారించలేదన్నారు. ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కారని చెప్పారు. న్యాయ వ్యవస్థ నిర్ధారించేంత వరకు వ్యక్తిగానే చూడాలన్నారు. మిథున్రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో ప్రతి కుటుంబంతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఇంతవరకు తుది చార్జిషీట్ వేయలేదన్నారు. చార్జీషీటు వేస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయంతో మిథున్రెడ్డి ఉన్నారన్నారు. ములాఖత్ అయిన వారిలో ధర్మానతో పాటు ఎమ్మెల్సీ నర్తు రామారావు, మామిడి శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.
బార్లకు రీ–నోటిఫికేషన్
శ్రీకాకుళం క్రైమ్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బార్ పాలసీ 2025–28లో భాగంగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ రీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు ప్రకటన విడుదల చేశారు. గత నెల 19 బార్లకు రెండు సార్లు (ఓపెన్, రిజర్వ్ క్యాటగిరీ) వేర్వేరు నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం లాటరీ పద్ధతిలో డ్రా తీసేందుకు దరఖాస్తులు కోరగా ఐదు బార్లకే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. మిగిలిన 14 బార్లలో శ్రీకాకుళం 6, పలాస, ఆమదాలవలస, ఇచ్ఛాపురాల్లో రెండేసి చొప్పున ఉన్న వాటికి ఈ నెల 15న కలెక్టర్ కార్యాలయంలో లాటరీ తీసి లైసెన్సుదారులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలుగా నిర్ణయించారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఐదుగంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
కిరాణాషాపులో ఎరువులు పట్టివేత
రణస్థలం/శ్రీకాకుళం క్రైమ్: నారువ గ్రామంలో మామిడిపాక వెంకట సత్యనారాయణ కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వచేసిన 25 బస్తాల యూరియా, ఎరువులను విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ డి.వి.వి.సతీష్ కుమార్కు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేయగా 14 బస్తాల యూరియా, 11 బస్తాల పోటాషియం, అమ్మోనియా వంటి ఇతర ఎరువులు అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వీటి విలువ రూ. 41వేలు ఉంటుందని చెప్పారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ తనిఖీలో విజిలెన్స్ ఎస్సై రామారావు, రణస్థలం వ్యవసాయ ఏవో డి.విజయభాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఎరువులను బ్లాక్మార్కెటింగ్ చేస్తే చర్యలు తప్పవని, ఇప్పటికే దళారులపై నిఘా ఉంచామని విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు స్పష్టం చేశారు.

కేసులు పెడితే దోషులవుతారా?