
అర్జీల పరిష్కారమే ప్రధానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీల పరిష్కారానికి అధికారులు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పా టు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలపై నాణ్యమైన ఎండార్సుమెంటు వేయాలని ఆదేశించారు.
కొన్ని వినతులు..
● చదువు పేరును అడ్డు పెట్టుకుని పుస్తకాల పేర్ల తో రాష్ట్రంలో కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్నారని, ఫీజులు అధికంగా వసూలు చేస్తూ విద్యార్థుల ప్రాణాలను బలి పెడుతున్నారని, ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ఫిర్యాదు చేశారు.
● జలుమూరు మండలం టెక్కలపాడు గ్రామంలో దివ్వలస వెంకటరమణ అనే దళితుడు తన ఇంటిని పెత్తందారులు ఆక్రమించుకుని వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
ప్రాథమికోన్నత పాఠశాలలను
ఎత్తివేయడం అన్యాయం
ఎలాంటి నిబంధనలు పాటించకుండా ప్రాథమికోన్నత పాఠశాలలను ఎత్తివేయడం అన్యాయమని, దీని వల్ల గ్రామీణ పేదలు విద్యకు దూరమవుతారని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస నియోజకవర్గంలో గల 22 ప్రాథమికోన్నత పాఠశాలలు, 20 స్కూల్లను ప్రైమరీ స్కూళ్లుగా మార్చి అప్పర్ ప్రైమరీ తరగతులు ఎత్తేశారని, దీని వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ఆమదాలవలస మండలం, బొబ్బిలిపేట గ్రామానికి చెందిన పేడాడ భరత్ కుమార్ అనే విద్యార్థికి జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకునేందుకు సీట్ ఇప్పించాలని కోరారు. సరుబుజ్జిలి మండలం, గోనెపాడు పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ను రాజకీయ కారణాలతో విధుల నుంచి తొలగించారన్నారు.
● ఇచ్ఛాపురం మండలం ఈదుపురం ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న మద్యం షాపు తొలగించాలని గ్రామానికి చెందిన ఉప్పాడ భాస్కరరావు, శీరపు నర్సింహమూర్తి, అంబటి పురుషోత్తం కోరారు. ఈదుపురం బిడ్జికి ఇరువైపులు విద్యుద్దీకరణ చేయాలని తెలిపారు. డొంకూరుకు పల్లె వెలుగు బస్సులు నడపాలని కోరారు.
● ఆమదాలవలసలో ఉపాధి నిధుల కాజేతకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆపాలని సువ్వారి గాంధీ కోరారు.
జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్