శ్రీకాకుళం క్రైమ్ : ‘గంజాయి బాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మా గ్రామాలను ఆనుకొని ఉన్న తోటల్లో, పొలాల్లోని నిర్మానుష్య ప్రదేశాలే స్థావరాలుగా చేసుకుంటున్నారు. పేకాట శిబిరాలు సైతం నిర్వహిస్తున్నారు. ఎవరైనా రాత్రి పూట బయ టకు వెళ్లాలన్నా.. బయటనుంచి ఊళ్లోకి రావాల న్నా.. రోడ్డు మీద ఎవరి మీద దాడి చేస్తారో.. ఏ ఒంటరి ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తారోనని భయంగా ఉంది’ అంటూ ఎచ్చెర్ల మండలంలోని ఐదు పంచాయతీల సర్పంచులు, ఓ ఎంపీటీసీ ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ధర్మవరం, పొన్నాడ, భగీరథపురం, ముద్దాడ, కొంగరాం గ్రామాల సర్పంచ్లు అల్లు కన్నబాబు, నేతింటి నీలం అప్పడు, నక్క కృష్ణమూర్తి, ముద్దాడ శంకరరావు, గుండ రవిలే కాక బొంతలకోడూరు ఎంపీటీసీ మాడుగుల జగదీష్లు, ఆయా గ్రామస్తులు ఎస్పీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో ఏముందంటే..
తమ గ్రామాల్లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలు, బళ్లు, వ్యానులలో వచ్చి గ్రామంలో పడి దేవాలయాల్లో ఉన్న వెండి, బంగారు ఆభరణాలు, పొలాల్లో మోటార్లు, ఆయిల్ ఇంజిన్లు, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు, ట్రాక్టర్లలో విలువైన పార్టులు, ఇళ్ల లో సామాన్లు, బంగారం, పాడి సంపదైన ఆవులు, గొర్రెలు, మేకలు ఎత్తుకుపోతున్నారని తెలిపారు. వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
ధర్మవరంలో జగనన్న కాలనీలో మోటారును, శ్మశానంలో సర్వీసు వైరును ఎత్తుకుపోయారన్నారు. ఉగాది నాడు సింతు సత్యం అతని సోదరుడు ఇంట్లో సుమారు 12 తులాల బంగారం చోరీకి గురైందని ఇప్పటికీ జాడలేదని, పొన్నాడలో నాలుగు ట్రాక్టర్ల బ్యాటరీలు, ఓ ట్రాక్టర్ గేజ్వీల్స్, ముద్దాడ, భైరిపురం, ఎస్ఎంపురం గుళ్లల్లో ఆభరణాలు చోరీ చేశారన్నారు.
కొన్ని స్థావరాల్లో..
పొన్నాడ కస్తూర్బా స్కూలు సమీపంలోను, కొంగరాం–పొన్నాడ లింకురోడ్డు సమీపంలోను తోటలు, పొలాలను గంజాయి బాబులు స్థావరాలుగా మార్చుకున్నారని తెలిపారు. మత్తు పదార్థాలు సేవించిన అనంతరం పొన్నాడ బ్రిడ్జి లింకు తోటపాలెం రూట్లో వాణి పబ్లిక్ స్కూలు సమీపంలో ఓ కిల్లీకొట్టు, నూడుల్స్కొట్టులో గడుపుతారని, బ్రిడ్జి దాటాక వరుసగా ఉన్న దాబాల్లో సైతం హల్చల్ చేసి రాత్రి 11 తర్వాత గ్రామాల్లో గ్రూపులుగా తిరుగుతారని విలేకరులతో అన్నారు. ఎస్పీని కలిసిన వారిలో సర్పంచులతో పాటు జి.ఎర్రనాయుడు, నక్క జగదీష్, కరగాన గణేషు, ఎర్ర వైకుంట తదితరులున్నారు.
ఎంపీటీసీ సహా ఐదుగ్రామాల సర్పంచ్ల ఆవేదన
ఎస్పీకి ఫిర్యాదు