
నిరుద్యోగులుగా మిగిలే...
చిరుద్యోగం
పోయే...
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
కూటమి ప్రభుత్వం చిరుద్యోగులపై కత్తి కట్టింది. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తీసేసే పనిలో పడింది. దానిలో భాగంగా తాజాగా సంచార పశు ఆరోగ్య సేవ (1962 వాహనాలు) అంబులెన్స్లో పనిచేసే ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడున్న వారి స్థానంలో ఎమ్మెల్యేలు సిఫార్సులు చేసిన వారిని నియమించాలని, ఆ వాహనాల నిర్వహణ సంస్థకు ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో దశల వారీగా సంచార పశు ఆరోగ్యసేవ సిబ్బందిపై వేటు పడుతోంది. ఉన్న వారిని తొలగించి, కొత్తవారిని వేసేలోపు ఆయా వాహనాల్లో ఎలాంటి మందులు పంపిణీ చేయవద్దని సూచన ప్రాయంగా చెప్పినట్టు తెలిసింది.
వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో సంచార పశు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. 1962 వాహనాలను ఏర్పాటు చేసి ఇంటింటికి వైద్య సేవలు విస్తృతంగా అందించింది. ఆ వాహనాల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచేది. పశువులకు ఏ మందులు అవసరమైతే వాటిని అక్కడికక్కడే అందజేసేది. సంచార ఆరోగ్య సేవ ద్వారా వైద్యం చేయలేని పరిస్థితి ఉంటే హైడ్రాలిక్ మిషన్ల సాయంతో ఆ పశువులను దగ్గరలో ఉన్న పశు వైద్య కేంద్రాలకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించేది. జిల్లాలో 18 వాహనాలను అందుబాటులోకి తీసుకురాగా దాదాపు 60మంది వరకు వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేసుకునేవారు. వారికి ఉపాధి దొరకడంతో పాటు పశువులకు సకాలంలో వైద్యం అందేది.
కూటమి సర్కారు శీతకన్ను..
సంచార పశు ఆరోగ్య సేవపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే శీతకన్ను వేసింది. అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చూపిస్తూ వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీనుంచి మే ఒకటో తేదీ వరకు వాహనాలను సైతం నిలిపేసింది. విమర్శలు వస్తున్న నేపథ్యంలో మే ఒకటో తేదీన వాహనాలను పునప్రారంభించింది. పాత ఏజెన్సీ కాదని భవ్య ఏజెన్సీకి టెండర్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. కొత్త ఏజెన్సీ ద్వారా వాహనాలైతే నడుపుతుందే తప్ప పశువుల వైద్యానికి సంబంధించిన మందులు మాత్రం పంపిణీ చేయడం లేదు.
ఆంక్షలు.. నిర్లక్ష్యం
వైఎస్ జగన్ ప్రభుత్వంలో డీజిల్కు నెలకి రూ. 30వేలు ఇచ్చేవారు. రోజుకి రూ.5వేల వరకు డీజిల్ లిమిట్ ఉండేది. ఇప్పుడది భారీగా తగ్గిపోయింది. రోజుకి రూ.1000కి మించి డీజిల్ వేయకూడదని, నెలకి రూ. 7వేలు దాటకూడదని ఆంక్షలు పెడుతోంది. దీంతో ఆ డీజిల్ ఎటూ సరిపోక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు వాహనాల మెంటెనెన్స్ కూడా చేయడం లేదు. మూడు నెలలుగా మూలన ఉండటంతో చాలావరకు బ్రేక్ డౌన్ అయిపోయాయి. అయినప్పటికీ అవే వాహనాలు తిప్పాలని సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పశువులు లేవలేని స్థితిలో ఉంటే హైడ్రాలిక్ మిషన్ సహాయంతో దగ్గరలో ఉన్న ఆస్పత్రికి మెరుగైన సేవలకు తీసుకెళ్లడం జరిగేది. ఇప్పుడా హైడ్రాలిక్ మిషన్ మెయింటెనెన్స్ చేయకపోవడంతో లిఫ్ట్ పనిచేయడం లేదు. అలాగే పశువులకు అవసరమైన కాల్షియం బాటిల్స్, మినరల్ మిక్సర్, ఎన్ఎస్ బాటిల్స్, హెవిల్, మెన్లెక్స్ ఇంజక్షన్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఉద్యోగులపై వేటు
ఇప్పటికే జిల్లాలో ముగ్గుర్ని తొలగించింది. మిగతా వారిని కూడా తొలగిస్తామని భవ్య ఏజెన్సీ ద్వారా సంకేతాలు పంపించింది. ఎమ్మెల్యేలు ఎవరినైతే సిఫార్సు చేస్తారో వారినే నియమించాలని భవ్య ఏజెన్సీకి ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. దీంతో భవ్య ఏజెన్సీ ప్రతినిధులు కూడా అదే విషయాన్ని సిబ్బందికి చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే సిఫార్సులే కొలమానం కావడంతో ఇప్పుడా పోస్టులకు బేరసారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
వరుసగా చిరుద్యోగులను తీసేస్తున్న ప్రభుత్వం
తాజాగా సంచార పశు ఆరోగ్య సేవ సిబ్బంది తొలగింపు
ఇప్పటికే ముగ్గురిని తొలగించగా.. మిగతా వారినీ తొలగిస్తామంటూ సంకేతాలు
ఎమ్మెల్యే సిఫార్సులున్న వారికే ఉద్యోగం
రోడ్డున పడిపోయాను
1962 అంబులెన్స్లో పైలెట్గా పనిచేశాను. మూడేళ్లుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు అకస్మికంగా తీసేశారు. ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు తొలగించేశారు. ఎమ్మెల్యే సిఫార్సులున్న వారికే ఉద్యోగమని భవ్య ఏజెన్సీ చెబుతోంది. చాలా ఇబ్బందులు పడుతున్నాను. రోడ్డున పడిపోయాను. ప్రభుత్వం దయ ఉంచి నా ఉద్యోగం నాకు ఇప్పిస్తారని కోరుతున్నాను.
– రాజాన ఈశ్వరరావు, 1962అంబులెన్స్ పైలెట్, సోంపేట మండలం.
స్ట్రీమ్లైన్ చేస్తున్నారు..
ఉద్యోగాల నియామకాలు, తొలగింపు నాకు తెలియదు. అవన్నీ ఏజెన్సీ చూసుకుంటుంది. ఎవరినైతే నియమించి ఇచ్చారో వారితో పనిచేయించుకోవడమే మా బాధ్యత. ప్రస్తుతం భవ్య ఏజెన్సీ ఆ వాహనాలకు సంబంధించి స్ట్రీమ్లైన్ చేస్తోంది. పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాక 1962వాహనాల ద్వారా వైద్య సేవలు, మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. – రాజగోపాల్, జాయింట్ డైరెక్టర్,
పశు సంవర్ధక శాఖ

నిరుద్యోగులుగా మిగిలే...