
సాక్షి కార్యాలయం ధ్వంసంపై ఎస్పీకి ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని ఎచ్చెర్ల కేంద్రంగా ఉన్న ‘సాక్షి’ పత్రికా ప్రధాన కార్యాలయంపై ఈ నెల 9న కొంతమంది టీడీపీ నాయకులు, వారి మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. ఘటనపై ఫిర్యాదు ఇచ్చేందుకు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని సాక్షి బ్రాంచ్ మేనేజర్ జేజీవీఆర్ స్వామిబెహరా, జిల్లా బ్యూరో చీఫ్ కందుల శివశంకర్ మరికొంతమంది మీడియా ప్రతినిధులు కలిశారు. కార్యాలయంపై దాడి జరిగిన తీరును ఎస్పీకి వివరించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో సాక్షి టీవీ బ్యూరో సునీల్కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బాలు, వాసు, సాక్షి క్రైమ్ రిపోర్టర్ నరసింహ ఉన్నారు.
పీజీ నాలుగో సెమిస్టర్
ఫలితాలు విడుదల
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ నాలుగో సెమిస్టర్ ఫలితాలను ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయభాస్కర్ మంగళవారం విడుదల చేశారు. 19 కోర్సుల్లో 498 మంది పరీక్షలు రాయగా అందులో 426 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్, వర్శిటీ వెబ్సైట్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సందేహాలుంటే 15 రోజుల్లోగా రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు ఆహ్వానం
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం (పెదపాడు)లోని పీఎం కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండి లవకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 4వ తరగతిలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే సీట్లు ఉన్నాయని, 8, 9, 10వ తరగతులతో పాటు ఇంటర్మీడియట్లో కేటగిరి 1, 2 అభ్యర్థులకు మాత్రమే (సీబీఎస్ఈ అఫిలియేటెడ్లో చదివిన వారికి) ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు జూన్ 16లోగా దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి వివరాలకు పెదపాడు కేంద్రీయ విద్యాలయంలో సంప్రదించాలని కోరారు.
హత్యాయత్నం కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష
సోంపేట : బారువ గ్రామానికి చెందిన తెప్పల కృష్ణారావు 2016 జూలై 26న మరొక వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన నాయని యోగేశ్వరరావు వ్యక్తిగత కక్షలతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కృష్ణారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ముద్దాయి యోగేశ్వరరావు నేరం చేసినట్లు రుజువు కావడంతో నాలుగేళ్ల జైలుశిక్ష పడినట్లు సోంపేట సీఐ బి.మంగరాజు మంగళవారం తెలిపారు.
లారీని ఢీకొన్న కారు
ఎచ్చెర్ల: లావేరు మండలం బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లావేరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అరసవల్లి ఈఓగా కేఎన్వీడీ ప్రసాద్
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి కొత్త ఈఓ (డిప్యూటీ కమిషనర్)గా కేఎన్వీడీ ప్రసాద్ను నియమిస్తూ మంగళవారం దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ఇంతవరకు విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఈఓగా పనిచేస్తూ అరసవల్లికి బదిలీ అయ్యారు. అక్కడ కూడా ఎఫ్ఏసీగా బాధ్యతలు కొనసాగించనున్నారు. కాగా ఇంతవరకు అరసవల్లి ఈఓగా పనిచేసిన వై.భద్రాజీని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఆలయ డిప్యూటీ ఈఓగా బదిలీ చేశారు. భద్రాజీ హయంలోనే ఆలయ పరిసరాల్లో కూల్చివేతలు జరిగాయి. అయితే తర్వాతి పరిణామాల్లో ఈయన వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్థానిక కూటమి ప్రభుత్వ పెద్దలే ఈయన్ను బదిలీపై వెళ్లిపోవాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం.
ఇద్దరు ఈఓలకు బదిలీ
జిల్లా దేవదాయ శాఖ పరిఽధిలో గ్రేడ్–2 ఈఓలుగా పాతపట్నం గ్రూప్ టెంపుల్స్లో పనిచేస్తున్న టి.వాసుదేవరావును పలాస గ్రూప్ టెంపుల్స్నకు, అలాగే పలాస గ్రూప్ టెంపుల్స్లో ఈఓగా పనిచేస్తున్న జి.గురునాధరావుకు టెక్కలి రావివలస ఎండల మల్లికార్జున స్వామి వారి ఆలయానికి బదిలీ చేశారు.

సాక్షి కార్యాలయం ధ్వంసంపై ఎస్పీకి ఫిర్యాదు