ఇంటి దొంగల పనే.. | - | Sakshi
Sakshi News home page

ఇంటి దొంగల పనే..

Jun 12 2025 7:31 AM | Updated on Jun 12 2025 7:31 AM

ఇంటి దొంగల పనే..

ఇంటి దొంగల పనే..

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌లో చోరీ

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలోని పైడిభీమవరంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 23న రూ.2 కోట్లు విలువైన 450 గ్రాముల సెమాగ్లుటైడ్‌ ఫౌడర్‌ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. కంపెనీ ఉద్యోగులే ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న పైడిభీమవరం రెడ్డీస్‌ ల్యాబ్‌లో ఎఫ్‌జీ వేర్‌హౌస్‌లోని రెండు బ్యాచ్‌ ఫ్రీజర్‌ రూమ్‌లో 450 గ్రాముల సెమాగ్లుటైడ్‌ డ్రగ్‌ చోరీకి గురైందని యాజమాన్యం జె.ఆర్‌.పురం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్‌ వివేకానంద పర్యవేక్షణలో మూడు బృందాలుగా విడిపోయిన జె.ఆర్‌.పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ చిరంజీవి, లావేరు ఎస్‌ఐ జి. లక్ష్మణరావులు కేసును ఛేదించినట్లు తెలిపారు. విదేశాలకు ఉత్పత్తి చేయడానికి అనుమతి ఉన్న ఈ డ్రగ్‌ను భారత్‌లో అమ్మేందుకు అనుమతి లేకపోయినా బ్లాక్‌ మార్కెట్టులో రెట్టింపు విలువుండటంతో తక్కువ కాలంలోనే కోట్లు ఆర్జించొచ్చని దుండగులు ఈ పథకం పన్నినట్లు తెలిపారు.

కంపెనీ దొంగలే..

పైడిభీమవరం రెడ్డీస్‌ ల్యాబ్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌లో ద్రోణాదుల సురేష్‌ , నరముల అప్పలనాయుడులు, వేర్‌హౌస్‌లో గాజుల వెంకటరాఘవేంద్ర పనిచేస్తున్నారు. ముగ్గురికీ మద్యం అలవాటుంది. సురేష్‌కు దువ్వాడ రెడ్డీస్‌ ల్యాబ్‌లో పనిచేస్తున్న విజయనగరం జిల్లా డెంకాడ మండలం మొదలవలసకు చెందిన గొల్లపల్లి కాంతారావుతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో కాంతారావు రెడ్డీస్‌ ల్యాబ్‌లో తయారవుతున్న సెమాగ్లుటైడ్‌ ఫౌడర్‌ తెస్తే వేరే వారికి అమ్మి డబ్బులు తెస్తానని సురేష్‌కు చెప్పడంతో సరేనన్నాడు. అది వేర్‌హౌస్‌లో విధులు నిర్వర్తిస్తున్న వెంకటరాఘవేంద్రతోనే సాధ్యమని తెలుసుకున్న సురేష్‌ అతనికి పని అప్పగించాడు.

పథకం ప్రకారం..

ఫిబ్రవరి 23న రాఘవేంద్ర డ్రగ్‌ను దొంగిలించి అప్పలనాయుడుకి ఇవ్వగా కంపెనీ ప్రహరీ నుంచి దూకి బయట ఓ చోట వుంచి.. డ్యూటీ దిగాక ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో దాచాడు. మూడు రోజులయ్యాక సురేష్‌కు పైడిభీమవరంలో ఇవ్వగా విశాఖపట్నంలో ఉన్న కాంతారావుకు డ్రగ్‌ను చేర్చాడు. కాంతారావు కూల్‌ ప్యాక్‌చేసి డ్రగ్‌ను హైదరాబాద్‌ తీసుకెళ్లి అప్పటికే పరిచయమున్న తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా చినరావుపేట మండలం లింగాపురానికి చెందిన అజ్మీరా తిరుపతికి ఇచ్చాడు.

అమ్మకంలో జాప్యమై..

కొత్త ప్రొడెక్ట్‌(డ్రగ్‌) కావడంతో మార్కెట్లో అమ్మకం కాకపోవడంతో ఇంట్లోనే డీఫ్రిజ్‌లో తిరుపతి ఉంచేశాడు. తిరుపతి అమ్మేసివుంటాడని సురేష్‌ డబ్బులకోసం తరచూ ఫోన్‌ చేయడం.. ఎంతకీ ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో రాఘవేంద్ర, అప్పలనాయుడులను వెంటబెట్టుకుని హైదరాబాద్‌ వెళ్లి తిరుపతి వద్ద డ్రగ్‌ను తీసేసుకున్నాడు. దేశంలో వివిధ ఫార్మా కంపెనీలతో పరిచయాలున్న గుంటక సురేష్‌రెడ్డిని కలిసి డ్రగ్‌ అమ్మకానికి పెట్టమన్నాడు.

డూప్లికేట్‌ ప్రొడక్ట్‌ ఇచ్చి..

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తెల్లప్రోలు గ్రామానికి చెందిన గుంటక సురేష్‌ రెడ్డి హైదరాబాద్‌ బెర్మగూడ అమీన్‌పూర్‌లో ఉంటున్నాడు. ఈయన 2022లో పైడిభీమవరం అరబిందో ఫార్మా కంపెనీలో పనిచేసేటప్పుడు మహంతి మురళీధర్‌, పట్నాల మహష్‌, గూడ శివరామకృష్ణతో కలసి పెల్లాడియమ్‌ అనే ప్రొడక్ట్‌ను అమ్మివేసిన కేసులో నిందితుడు. అప్పట్లోనే అరబిందో కంపెనీ ఇతనికి ఉద్వాసన పలికింది. సురేష్‌రెడ్డి కూడా సరైన ధర రాకపోవడంతో డ్రగ్‌ను అమ్మలేకపోయాడు. గట్టిగా ప్రశ్నించినా సమాధానం లేకపోవడంతో డి.సురేష్‌.. జి.సురేష్‌రెడ్డి సొంత గ్రామానికి వెళ్లి ఒత్తిడి చేయడంతో హైదరాబాద్‌ వచ్చి డ్రగ్‌ను తీసుకుపోండని చెప్పాడు. దీంతో డి.సురేష్‌ విశాఖపట్నం పీఎంపాలెం, మధురవాడలకు చెందిన కల్లూరి బాలకృష్ణ, బగాతి నవీన్‌కుమార్‌లను వెంటబెట్టుకుని హైదరాబాద్‌ వెళ్లగా సురేష్‌ రెడ్డి డూప్లికేట్‌ డ్రగ్‌ ప్రొడెక్ట్‌ను ఇచ్చి ఏమార్చాడు. సురేష్‌ అదే డ్రగ్‌ను కాంతారావు సహాయంతో హైదరాబాద్‌లో ఉన్న తిరుపతికి ఇవ్వడం.. డూప్లికేట్‌ కావడంతో ఎవరూ కొనకపోవడంతో వారిలో గొడవలు మొదలయ్యాయి.

మరో కేసు వెలుగులోకి..

పై కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే వీరు చేసే మరో నేరం బయటపడింది. ఎనిమిది నెలల క్రితం ఇదే రెడ్డీస్‌ ల్యాబ్‌లో రూ.60 లక్షల విలువైన 3.38 కిలోల పెల్లాడియం అసిసేట్‌ను ఈ ఉద్యోగులే చోరీ చేశారు. డి.సురేష్‌, రాఘవేంద్ర, అప్పలనాయుడులు కలసి జి.సురేష్‌రెడ్డికి డ్రగ్‌ను ఇవ్వగా అతను లల్లూయాదవ్‌ అనే వ్యక్తికి రూ. 25 లక్షలకు అమ్మడం.. అందులో రూ. 8 లక్షలు సురేష్‌రెడ్డి ఉంచేసుకుని మిగతా రూ.17 లక్షలు డి.సురేష్‌కి ఇవ్వడం.. డి.సురేష్‌ మిగతా ఇద్దరికి చెరో రూ.లక్ష చొప్పున ఇచ్చి రూ. 15 లక్షలు ఉంచేసి ఒకరికొకరు మోసం చేసుకుని చివరికి పోలీసుల విచారణలో నిజాలు చెప్పేశారు.

నిందితులకు రిమాండ్‌..

డ్రగ్‌ కేసులో డి.సురేష్‌, వెంకటరాఘవేంద్ర, అప్పలనాయుడు, కాంతారావు, సురేష్‌రెడ్డి, తిరుపతి, బాలకృష్ణ, నవీన్‌కుమార్‌లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి సెమాగ్లుటైడ్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 60 లక్షల విలువైన పెల్లాడియంను రికవరీ చేయాల్సి ఉందని ఎస్పీ తెలిపారు.

ప్రతిభకు ప్రశంసలు..

కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో మూడు బృందాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విలువైన ప్రొడక్టులు ఉండేచోట సీసీకెమెరాలు లేకపోవడం విడ్డూరమని, మిగతా కంపెనీలు కచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించారు. కాగా, సెమాగ్లుటైడ్‌ డ్రగ్‌ టైప్‌–2 డయాబెటిస్‌ చికిత్స, దీర్ఘకాలిక ఊబకాయ నియంత్రణకు ఉపయోగించే పూర్తి పేటెంట్‌ ఉన్న ఔషధం. పెల్లాడియం అసిటేట్‌ అనేది రసాయన సమ్మేళనం.

రూ.2 కోట్ల విలువైన 450 గ్రాముల

సెమాగ్లుటైడ్‌ చోరీ కేసు ఛేదన

ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement