
ఏడాదిలో ప్రజలకు చేసిందేమీ లేదు
● మీడియా సమావేశంలో సీపీఎం నాయకులు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిలో ప్రజలకు చేసిందేమీ లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి, పి.తేజేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన ఏడాదిలో ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని, ప్రజలకు అప్పులు తప్ప ఆదా యం లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని, జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి చివరి భూముల వరకు నీరు అందిస్తామని, జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవ లు అందిస్తామని చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయలేకపోయారో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడం వల్ల గిరిజనులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, గిరిజనుల భూములను గిరిజనేతరులు తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో జీడి రైతులు తీవ్రంగా దోపిడీకి గురవుతున్నారని ఆవేద న వ్యక్తం చేశారు. వంశధార రిజర్వాయర్ పూర్తిచేసి చివరి భూముల వరకు రెండు పంటలకు నీరివ్వాలని, నేరడి వద్ద బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశా రు. జిల్లాలో అక్రమ మైనింగ్ రద్దు చేయాలని డి మాండ్ చేశారు. కార్గో ఎయిపోర్టు పేరుతో భూ దోపిడీ ఆపాలని, సముద్రతీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టపెట్టొద్దని వారు డిమాండ్ చేశారు. కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.