
బాలలను పనిలో చేర్చుకుంటే చర్యలు
శ్రీకాకుళం అర్బన్: బాలలను కార్మికులుగా పనిలో చేర్చుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని బాలల సంరక్షణ అధికారి కేవీ రమణ అన్నారు. శ్రీకాకుళంలోని నెహ్రూ యువజన కార్యాలయం వద్ద జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, బ్రెడ్స్ సంస్థ, జిల్లా కార్మిక శాఖ, ఏహెచ్టీయూ, ఐసిపిఎస్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం నుంచి డే నైట్ జంక్షన్ వరకు బాల కార్మికుల నియంత్రణపై అవగాహన ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ బాలలను కార్మికులుగా పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని, అలాగే ఎక్కడైనా అలాంటి పిల్లల్ని గుర్తిస్తే 1098 లేదా 112 కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు. జిల్లా యాక్సిస్టు జస్టిస్ ప్రోగ్రాం మేనేజర్ మజ్జి సింహాచలం మాట్లాడుతూ మన దేశాన్ని బాల కార్మిక రహిత దేశంగా తీర్చిదిద్దాలని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకులు భువన్ రిబ్బు ముఖ్య ఉద్దేశమని అన్నారు. జిల్లాని బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, వివిధ ప్రభుత్వ ఇతర సంస్థలు సమన్వయంతో పనిచేయడం జరుగుతుందన్నారు. కార్మిక శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 18 ఏళ్ల పిల్లలను పనిలో చేర్చుకోవద్దని సూచించారు.