
బంగారం కోసమే వృద్ధురాలి హత్య
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం గ్రామంలో ఈ నెల 9వ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలి మెడలో ఉన్న బంగారం కోసమే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. దుంపల దాలమ్మ తన ఇంటిలో మోటార్ పాడైపోవడంతో ఈ నెల 8న దా న్ని బాగుచేసేందుకు అదే గ్రామానికి చెందిన బల్లి రాము అనే వ్యక్తిని పిలిచింది. రిపేర్ చేసేందుకు వచ్చిన రాము వృద్ధురాలు ఒంటరిగా ఉండటం గమనించి, ఆమె మెడలో విలువైన బంగారు తాడు ఉండటం గుర్తించి మరుసటి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు రాత్రి 8గంటల సమయంలో మోటార్ మరమ్మతులు చేసేందుకు వృద్ధురాలి ఇంటికి వచ్చి ఆమెను టీ పెట్టమని చె ప్పాడు. ఆమె టీ పెడుతుండగా వెనుక నుంచి వచ్చి న రాము తనతో తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో ఆమె తలపై బలంగా కొట్టి మెడలో ఉన్న రెండున్నర తు లాల బంగారం గొలుసుతో అక్కడ నుంచి పారిపోయాడు. వృద్ధురాలి కుమారుడు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు శుక్రవారం హరిశ్చంద్రపురం బస్టాప్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి బంగారం గొలుసు, ఇనుపరాడ్డు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్కు తరలించారు.