
ఇంటింటికీ రేషన్ కొనసాగించాలి
పాతపట్నం: రేషన్ బియ్యం, సరుకులను ఇంటింటికి అందజేసే ఎండీయూ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడం దురదృష్టకరమని, దీని వల్ల రేషన్ డీలర్లు సరుకులను నల్ల బజారులో అమ్ముకుంటారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. పాతపట్నంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పార్టీ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ ఆధ్వర్యంలో సీపీఐ జిల్లా 25వ మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఎండీఎం వ్యవస్థపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే శ్రీకాకుళం జిల్లా నుంచే ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని, అది నిజమైన పాలన కాదన్నారు. మావోయిస్టులను చంపితే దేశం అభివృద్ధి చెందదని, నిరుద్యోగ సమస్య పరిష్కరించి పేదరిక నిర్మూలన చేయాలన్నారు. దోపిడీ వ్యవస్థను కొనసాగించకుండా చూడాలని, గిరిజనులను కాపాడాలని కోరారు. లేదంటే ఎర్రజెండాలు అంతా ఒకటవుతాయన్నారు. ఇటీవల పాకిస్తాన్తో యుద్ధ జరిగితే కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిందని, కానీ దేశంలో ఉన్న మావోయిస్టులతో మాత్రం చర్చలు జరపకుండా కాల్పులు జరపడం తగదన్నారు. వంశధార రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అంతకుముందు పాతపట్నం సెంటెన్స్ పాఠశాల నుంచి సబ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణ మూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్.కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు చాపర సుందర్లాల్, జిల్లా అదనపు కార్యదర్శి లండ వెంకటరావు, ఎస్.నర్సింహులు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, మండల కార్యదర్శి దూసి శారద, దూసి భాస్కరరావు, డీహెచ్పీఎస్ ప్రధాన కార్యదర్శి గోపి, నాయకులు ఆదినారాయణ ఆచారి, మోహన్రావు, సింహచలం, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంటింటికీ రేషన్ కొనసాగించాలి