ఇంటర్‌ విద్యలో బది‘లీలలు’ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యలో బది‘లీలలు’

Jun 12 2025 7:29 AM | Updated on Jun 12 2025 7:31 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్‌ విద్యనందిస్తున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉద్యోగుల బదిలీలు విమర్శలకు తావిస్తోంది. ప్రిన్సిపాళ్లు, జూనియర్‌ లెక్చరర్లు, సిబ్బంది బదిలీల పర్వంలో చోటుచేసుకున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో పలువురి నేతలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా అనేకమంది తమకు నచ్చిన స్థానాలను ఎగరేసుకుపోగా.. ఇంకొంతమంది తీవ్ర అన్యాయానికి గురై నష్టపోయారు. సీనియారిటీ ఉన్నప్పటికీ గత్యంతరంలేక సుదూర ప్రాంతాలకు వెళ్లిపోవావాల్సి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు.

నో ఆప్షన్‌..

జిల్లాలో 38 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్లు 29, జేల్స్‌ 85 మంది వరకు ఉన్నారు. వీరితోపాటు ఆఫీస్‌ సబార్డినేట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, రికార్డ్‌అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ తదితర నాన్‌టీచింగ్‌ సిబ్బంది మరో 89 మంది వరకు పనిచేస్తున్నారు. వీరందరిలో సుమారు 75 మంది వరకు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా పనితీరు ఆధారంగా ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లకు పాయింట్లను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియారిటీతోపాటు విద్యార్థుల సంఖ్య, వారి ఫలితాలకు కూడా ప్రత్యేక పాయింట్లను కేటాయించారు. ఈ మార్గదర్శకాల ప్రకారం ఆప్షన్లుగా ఇచ్చుకున్నారు. అయితే వారు ఎంపికచేసిన మొదటి ప్రయారిటీ ఆప్షన్లను కాదని వేరేచోట్ల నియామకం చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. రేషనైలేజేషన్‌ చర్యలు వల్ల షిఫ్టింగ్‌ పోస్టుల్లో చేరేందుకు లెక్చరర్లు ఆసక్తి చూపలేదు. మొత్తమ్మీద జిల్లాలో ఇప్పటి వరకు 58 మంది వరకు బదిలీలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

పైరవీలకే పెద్దపీట..

తమకు కావాల్సిన స్థానం కోసం కూటమి ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు, అధికార పార్టీ నాయకుల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసులు, పైరవీలు పెద్ద ఎత్తున పనిచేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులను ప్రసన్నం చేసుకుని అనేక మంది లెక్చరర్లు/ కాంట్రాక్ట్‌ లెక్చరర్లు వారు పనిచేస్తున్న స్థానాలను కాపాడుకోవడం కోసం ఆర్జేడీ కార్యాలయంలో పైరవీలు చేసుకుని బ్లాక్‌ చేసుకున్నారని ప్రచారం సాగుతోంది. పోస్టులను బ్లాక్‌ చేస్తున్నారన్న విషయం ఏకంగా ఇంటర్మీడియెట్‌ విద్య డైరెక్టర్‌కు చేరినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలుస్తోంది.

ప్రిన్సిపాళ్లు, లెక్చరర్ల ఆప్షన్స్‌ను

పరిగణనలోకి తీసుకోని ప్రభుత్వం

రాజకీయ సిఫారసులు, పైరవీలతో ఇష్టారాజ్యం

పారదర్శకమే..

ఇంటర్మీడియెట్‌ విద్యలో బదిలీల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగాయి. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు జరిగాయి కాబట్టి ఆరోపణలకు ఆస్కారంలేదు. ప్రభుత్వ మార్గదర్శకాలు, సీనియారిటీ ప్రకారమే ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, సిబ్బంది బదిలీలను పకడ్బందీగా చేపట్టడం జరిగింది. మరికొంతమంది బదిలీలు ఇంకా మిగిలి ఉన్నాయి.

– ఆర్‌.సురేష్‌కుమార్‌,

ఇంటర్మీడియెట్‌ విద్య డీఐఈఓ, శ్రీకాకుళం

ఇంటర్‌ విద్యలో బది‘లీలలు’1
1/1

ఇంటర్‌ విద్యలో బది‘లీలలు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement