
కక్ష ఎందుకో?
పక్షవాత బాధిత ఉద్యోగులపై..
● ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న
కూటమి పాలకులు
● గోడు వినకుండా దూరప్రాంతాలకు బదిలీలు
● ఆవేదన చెందుతున్న బాధితులు
బాధితుల్లో కొందరు..
బోనెల గాయత్రి: ఈమె అమలపాడు (టెక్కలి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. పక్షవాతం సోకి చెయ్యి, కాళ్లు పడిపోయాయి. గత ప్రభుత్వం వెసలుబాటు ఇచ్చినా ఈసారి మాత్రం ఏకంగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలవరం (నౌపడ) జెడ్పీ హైస్కూల్కు బదిలీ చేశారు.
ఎస్.రామప్పడు: ఈయన మండాకురిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్. పదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. గత ప్రభుత్వం మానవతా దృక్పథంతో బదిలీ చేయకపోగా..ఈసారి మాత్రం కూటమి సర్కారు ఏకంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతకవిటి జెడ్పీ హైస్కూల్కు బదిలీ చేసేసింది. నలుగురి తోడుతోనే బదిలీ కౌన్సెలింగ్కు హాజరైనా అధికారులు ఏమాత్రం కనికరం చూపలేదు.
డి.గణేశ్వరరావు: ఈయన కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్. దివ్యాంగుడైన ఈయనకు రెండు కిడ్నీలు పాడైపోయాయి. మూర్ఛ రోగం.. పక్షవాతం కూడా. ఈయన పరిస్థితి చూసి తోటి ఉద్యోగులు విధుల విషయంలో చాలా సహకరిస్తారు. అయినా కూటమి ప్రభుత్వం జాలి చూపించకుండా ఏకంగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడారి రాజపురం జిల్లా పరిషత్ హైస్కూల్కు బదిలీ చేశారు.
అరసవల్లి:
వారంతా ఒకప్పుడు ఎంతో హుషారుగా పంచాయతీరాజ్ శాఖలో విధులు నిర్వర్తించినవారే.. కానీ దురదృష్టవశాత్తు పక్షవాతానికి గురయ్యారు.నలుగురు తోడులేకపోతే...ఇంటి నుంచి కార్యాలయానికి రాలేని దుస్థితి. అయినా విధుల విషయంలో ఎక్కడా తగ్గకుండా తమవంతు పనులు పూర్తి చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వీరిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేసేశారు. కనీసం కనికరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జెడ్పీ సీఈవో శ్రీధర్రాజా బదిలీ ఉత్తర్వులు ఇవ్వడంతో బాధితులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటి సీఎం పవన్కళ్యాణ్కు మొరపెట్టుకున్నా ఏమాత్రం పట్టించుకోలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులను బదిలీల అంశంలో గత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా వారికి సమీప స్థానాలను కేటాయించిన సంగతి విదితమే.
బదిలీలతో అవస్థలు..!
పంచాయతీరాజ్ వ్యవస్థలో జిల్లా పరిషత్ యాజమాన్యానికి జెడ్పీ చైర్పర్సన్దే రాజముద్ర. అలాంటింది.. కూటమి ప్రభుత్వంలో తమ పార్టీకి చెందని వారు చైర్మన్లుగా ఉన్న క్రమంలో ఏమాత్రం ఆ స్థానానికి ప్రాధాన్యం ఇవ్వకుండా బదిలీల ప్రక్రియను చేపడుతున్నారు. జెడ్పీ యాజమాన్య ఉద్యోగులకు ఎనిమిది నెలల క్రితమేలో బదిలీలు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం అనాలోచిత నిబంధనలతో మళ్లీ ఇదే శాఖలో బదిలీల కౌన్సెలింగ్ చేపట్టి ఉద్యోగులను తీవ్ర అవస్థలకు గురిచేసింది. వాస్తవానికి ఎనిమిది నెలల క్రితం పలు ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగుల పాత స్థానాల నుంచి ఎస్ఆర్లు కొత్త ప్రదేశాలకు చేరలేదు. అయినప్పటికీ ఐదేళ్ల నిబంధనలంటూ లాస్ట్ గ్రేడ్ ఉద్యోగులను సైతం వదలకుండా బదిలీలు చేపట్టింది. దీంతో యంత్రాంగం కూడా తీవ్ర ప్రయాసలకు లోనై.. మరోవైపు కూటమి నేతల సిఫారసు లేఖల ఒత్తిళ్లతో నలిగిపోయారు. అయినప్పటికీ ఏదోలా బదిలీల ప్రక్రియను ముగించారు. బదిలీ జరిగిన ఉద్యోగులు వెంటనే కొత్త స్థానాల్లో చేరాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
మినహాయించాల్సింది..
అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు, దివ్యాంగులకు బదిలీ మినహాయింపు ఇవ్వాల్సింది. వారు దూరప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయడం ఇబ్బందిగా ఉంటుంది. మానవతా దృక్పథంతో మినహాయింపు ఇస్తే మంచిదని మా అభిప్రాయం.
– కె.నారాయణరావు, పి.ఆర్.మినీస్టిరియల్
ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు

కక్ష ఎందుకో?

కక్ష ఎందుకో?

కక్ష ఎందుకో?

కక్ష ఎందుకో?