ఇసుక ట్రాక్టర్ల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

Jun 12 2025 7:31 AM | Updated on Jun 12 2025 7:31 AM

ఇసుక

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

జలుమూరు: కొమనాపల్లి వద్ద వంశధార నది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తున్న ఎనిమిది ట్రాక్టర్లను పట్టుకుని రూ.24 వేలు అపరాధ రుసుం వసూలు చేశామని తహసీల్దార్‌ జెన్ని రామారావు బుధవారం తెలిపారు. ఇప్పటికే పలుమార్లు దండోరాలు, హెచ్చరికలు చేసినా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తుండటంతో దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒక్కో ట్రాక్టర్‌కు మూడు వేలు చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన

భోజనమే లక్ష్యం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం సరఫరా అవుతున్న సాధారణ బియ్యం స్థానంలో త్వరగా ఉడికే, నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. గురువారం నుంచే సన్న బియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. మొత్తం 2,599 పాఠశాలలు, 153 హాస్టళ్లకు కలిపి 655 టన్నుల సన్న బియ్యం ఇప్పటికే సరఫరా పూర్తయ్యిందన్నారు. బియ్యం సరఫరాలో పారదర్శకత కోసం ‘ట్రేసబిలిటీ’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రజాదరణ ఓర్వలేకే కవ్వింపు చర్యలు

టెక్కలి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక కూటమి నాయకులు కుట్రలు పన్నుతున్నారని, ఇందులో భాగంగానే పొదిలిలో కవ్వింపు చర్యలుగా రాళ్లతో దాడులు చేశారని న్యాయవాది, వైఎస్సార్‌సీపీ నాయకుడు సింగుపురం మోహన్‌రావు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రిపై ఇలా దాడులు చేయడం సబబు కాదన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి తప్పు చేశామనే భావన ప్రజల్లో ఏర్పడిందని, అందుకే మరలా జగన్‌ పాలన కోరుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్‌ కాన్వాయ్‌పై దాడికి పాల్పడి కూటమి నాయకులు కుట్ర బుద్ది చూపించారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

కేంద్ర గ్రంథాలయాన్ని పరిరక్షించాలి

శ్రీకాకుళం అర్బన్‌: జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని రక్షించాలని పలువురు ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్‌ భవన్‌లో బుధవారం కేంద్ర గ్రంథాలయ పరిరక్షణ కమిటీ సమావేశం అధ్యక్షుడు కరణం బుచ్చి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి తమరి వైకుంఠరావు మాట్లాడుతూ కేంద్ర గ్రంథాలయం భవన సముదాయాన్ని అన్యాక్రాంతం చేసే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్ష కార్యదర్శులు ఎం.ప్రభాకర్‌, పి.సుధాకర్‌, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పేకల తేజేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక ఎడ్యుకేషన్‌ సబ్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ గొంటి గిరిధర్‌, జె.వి.వి.సమత, కో–కన్వీనర్‌ తంగి ఎర్రమ్మ, గ్రంథాలయ ఉద్యోగ సంఘ నాయకులు ఉగ్రసేన, చిరంజీవి పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

పాతపట్నం: కాగువాడ గ్రామానికి చెందిన అగూరి కేశవరావు(41) శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్‌ఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. కేశవరావు ఈ నెల 9వ తేదీ రాత్రి గ్రామ పరిధిలోని రహదారిపై నడిచి వెళుతుండగా.. సీది నుంచి బూరగాం వైపు వస్తున్న ద్విచక్ర వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని పాతపట్నం సీహెచ్‌సీ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కేశవరావు భార్య ఉషాకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలిపారు.

ఆర్టీసీలో బదిలీలు

శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో పలువురు ఆర్టీసీ అధికారులకు బదిలీలు జరిగాయి. శ్రీకాకుళం ఒకటో డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న వి.రమేష్‌కు పాలకొండ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌గా, పలాస డిపోలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న పినకాన సంతోష్‌కు శ్రీకాకుళం ఒకటో డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌గా బదిలీ జరిగింది. వీరు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. సాలూరు డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న కరుణశ్రీ పలాస డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌గా బదిలీ అయ్యారు.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత 1
1/2

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత 2
2/2

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement