
యువతిని మోసగించిన యువకుడిపై కేసు
శ్రీకాకుళం రూరల్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీకాకుళం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేగిడి మండలం అంబాడ గ్రామానికి చెందిన దళిత యువతి, పాలకొండ మండలం రాజుపేటకు చెందిన రౌతు వెంకటేష్ జిల్లా కేంద్రం సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసేవారు. కులాలు వేరైనా ప్రేమిస్తున్నానంటూ వెంటపడటంతో యువతి సరేనంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా కాలయాపన చేస్తూ తప్పించుకుంటున్నాడంటూ రేగిడి పోలీస్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్నానని, పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు కాపీ శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్కు చేరగా.. ఎస్ఐ రాము మంగళవారం కేసు నమోదు చేశారు.
యువతి ఆత్మహత్య
మెళియాపుట్టి: సిరియాకండి గ్రామానికి చెందిన తోనంగి సునీత(19) అనే యువతి నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మెళియాపుట్టి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సునీత శ్రీకాకుళంలోని నారాయణ పారా మెడికల్ ఇన్స్టిట్యూట్లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతుండేది. అక్కడే ఓ గదిలో నలుగురు స్నేహితురాళ్లతో కలిసి అద్దెకు ఉండేది. 40 రోజుల కిందట వేసవి సెలవుల కోసం గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నుంచి కుమార్తె కనిపించపోవడంతో మృతురాలి తండ్రి ప్రసాదరావు అన్నిచోట్లా వెతికారు. మంగళవారం గ్రామానికి దూరంగా ఉన్న నేలబావిలో మృతదేహం తేలడంతో నిర్ఘాంతపోయారు. తండ్రి ప్రసాద్ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రేమవ్యవహారం గానీ, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు ఎస్సై రమేష్బాబు తెలిపారు.
శాశ్వత లోక్ అదాలత్తో బీఎడ్ అభ్యర్థికి న్యాయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: తన సమస్య పరిష్కారం కోరుతూ శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించిన బీఈడీ చదివిన అభ్యర్థికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. శ్రీకాకుళం మండలం వాకలవలసకు చెందిన కూన హరిప్రసాద్ ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక బీఎడ్ కోర్సు పూర్తి చేశాడు. ఒరిజినల్ సర్టిఫికెట్ (ఓడీ), మార్క్షీట్ అందించాని 2022లో యూనివర్సిటీ అధికారులకు చలానా, ఇతర వివరాలను అందజేస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. మూడేళ్లు గడిచినా పట్టించుకోలేదు. దీంతో హరిప్రసాద్ జిల్లా కోర్టు ఆవరణలోని శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించాడు. చైర్మన్ జి.జ్ఞానసువర్ణ రాజు విచారణ చేపట్టి అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం వర్సిటీ అధికారులు హాజరై పత్రాలు అందించారు.