
ప్రైవేటీకరణ ప్రతిపాదన ఆపాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు కోరారు. స్టీల్ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ఆపాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పిలుపులో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తన కుట్రలు మానుకోవాలని సూచించారు. 32 మంది ప్రాణ త్యాగాలతో, వామపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలతో విశాఖ స్టీల్ప్లాంట్ను సాధించుకున్నారని గుర్తు చేశారు. 64 గ్రామాల ప్రజలు 24 వేల ఎకరాల భూములను త్యాగం చేశారని పేర్కొన్నారు. స్టీల్ప్లాంట్ను రక్షిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి పార్టీలు తమ హామీని నిలుపుకోవాలన్నారు. పోరాడి సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పి.చంద్రారావు, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు చిక్కాల గోవిందరావు, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, అల్లు సత్యనారాయణ, కె.సూరయ్య, పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఎండీఎం యూనియన్ నాయకురాలు తూతిక ప్రవీణ, బీఎస్ఎన్ఎల్ యూనియన్ నాయకులు ఎం.గోవర్ధనరావు, పెన్సనర్స్ యూనియన్ నాయకులు పార్వతీశం, నాగార్జున అగ్రికెమ్ యూనియన్ నాయకులు ఎ.సత్యనారాయణ, ఎల్.రామప్పడు, ఎం.రమణ, కేదారేశ్వరరావు, పి.సుధాకర్ బాబు, టి.రవికుమార్, వైఎస్సార్ జిల్లా మేధావుల విభాగం ఎస్.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.