ప్రశాంతి నిలయం: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కార్ నిర్వహించిన దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పుట్టపర్తిలోని కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపి జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నాయకులు పట్టణంలోని గణేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీకి పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. అయినప్పటికీ అన్ని అడ్డంకులు దాటుకుని కలెక్టరేట్కు చేరుకుని జేసీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలపై నిరుద్యోగ యువతకు చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. పారదర్శకత లేక పోవడం, మెరిట్ లిస్ట్ బహిరంగ పరచకపోవడం, కేవలం ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే ఎస్ఎంఎస్లు పంపడం, కాల్ లెటర్ల విషయంలో గందరగోళం సృష్టించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒక్కో పోస్ట్కు రూ.లక్షల్లో బేర సారాలు జరిగాయన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతో పోస్టులు కేటాయించారన్న ఫిర్యాదులు, కోర్టుకు వెళ్లిన అభ్యర్థులపై ఒత్తిళ్లు తెచ్చారన్న ఆరోపణలు యువతలో తీవ్ర అసంతృప్తులకు గురి చేస్తున్నాయన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అర్హులైన అభ్యర్థులకు పోస్టులు ఇవ్వకపోవడం, కోర్టు తీర్పు తర్వాత కూడా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతోందన్నారు.
మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
డీఎస్సీ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. డీఎస్సీ నియామకాలపై హైకోర్టు జడ్జి, సీబీఐతో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రశ్న పత్రాల తయారీ, అప్లోడ్ నిర్వహణలో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్ట్ సిబ్బంది పాత్రపై పూర్తి విచారణ జరపాలన్నారు. మెరిట్ లిస్ట్లు, మార్కులు, ఎంపిక వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అక్రమంగా ఎంపికైన వారిపై చర్యలు తీసుకొని నిజమైన వారికి న్యాయం చేయాలని కోరారు.
ఆమరణ దీక్షలకు సిద్ధం
లీకేజీ ప్రభుత్వం
డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఆమరణ నిరాహార దీక్షలకు సైతం సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు, లోకేష్ క్షమాపణ చెప్పాలి.
– అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి
చంద్రబాబు ప్రభుత్వం అంటేనే లీకేజీ ప్రభుత్వం. పది, ఇంటర్, ఏపీసెట్...ఇలా అన్ని పరీక్ష పేపర్లను లీకేజీలు చేసి లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికై నా విచారణచేసి పేపర్ లీకులు, డేటా తొలగింపు, మెరిట్ లిస్ట్లో అవక తవకలపై వెంటనే సమాధానం చెప్పాలి.
–గంగుల సుధీర్రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు
కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నిరసన
జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేత
గణేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ
మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్


