పరిగి: మండలంలోని సేవామందిరం ఏఎం లింగణ్ణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988–89 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం అదే స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముప్పై ఏడు ఏళ్ల తరువాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒకరి కష్టసుఖాలు ఒకరు తెలుసుకోవడంతో పాటు నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం గురువులకు శాలువాలతో సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో గురువులు సుధాకర్రావు, ప్రభాకర్రావు, పుల్లప్ప, కనకవల్లి, సత్యనారాయణ, పూర్వ విద్యార్థులు లక్ష్మణమూర్తి, మహేష్, మల్లికార్జునస్వామి, అహమ్మద్, లక్ష్మణ్, సుదర్శన్రెడ్డి, శంకరప్ప, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.


