మడకశిర: ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లే అంతర్రారష్రట దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు మడకశిర యూజీ పీఎస్ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను స్థానిక ఎస్ఐ లావణ్యతో కలిసి ఆయన వెల్లడించారు. మడకశిర ప్రాంతంలో ఇటీవల పలువురి ద్విచక్ర వాహనాలను దుండగులు అపహరించారు. ఆయా ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు... కల్లుమర్రి క్రాస్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అగ్రంపల్లి గ్రామానికి చెందిన శివప్ప, సాయి అలియాస్ సాయిప్రభును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో మడకశిరతో పాటు కర్ణాటకలోని పావగడలో ద్విచక్ర వాహనాల అపహరించి అగ్రంపల్లి గ్రామ సమీపంలోని తన పొలానికి ఆనుకుని ఉన్న ముళ్లకంపల పొదల మాటున దాచినట్లు శివప్ప అంగీకరించాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని రూ.8.50 లక్షల విలువైన పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
పది ద్విచక్ర వాహనాల స్వాధీనం


