పావగడ: వ్యవసాయదారుడు, స్థానిక మాజీ మంత్రి వెంకటరమణప్ప పార్థివ దేహానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాళులర్పించారు. వెంకటరమణప్ప కుమారుడు స్థానిక ఎమ్మెల్యే వెంకటేష్ కుటుంబసభ్యులను పరామర్శించారు. శనివారం పావగడ తాలూకాలోని హనుమంతనహళ్లికి చేరుకున్న సిద్దరామప్ప.. వెంటరమణప్ప భౌతిక కాయాన్ని చూడగానే కంట తడి పెట్టారు. వెంకటరమణప్ప మృతి తనకు వ్యక్తిగతంగా తీరని నష్టమని పేర్కొన్నారు. ఇంత త్వరగా తన మిత్రడు కనుమూస్తాడని అనుకోలేదని, ఇంకా పదేళ్లు బతికే అవకాశముండేదని బాధ పడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం సాగించిన పోరాటాలను గుర్తు చేశారు. మంత్రులు జమీర్ అహమ్మద్, కేజే జార్జ్, మధుగిరి ఎమ్మెల్యే కేఎన్ రాజణ్ణ, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య, రాజేంద్ర కేఎన్ రాజణ్ణ, ఎంపీ గోవింద కారజోళ, జెడ్పీ మాజీ అధ్యక్షురాలు శాంతలారాజణ్ణ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్సీ నారాయణస్వామి, సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి, కలెక్టర్ శుభ కళ్యాణ్, సీఈఓ అశ్విజ, తదితర ప్రముఖులు వెంకటరమణప్ప పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.రాజనహళ్లి వాల్మీకి ప్రసానందస్వామితో పాటు 25 మంది సాధువులు వెంకటరమణప్ప పార్థివదేహాన్ని సందర్శించారు. అనంతరం ఆయన అంత్యక్రియలు తాను ప్రేమతో పెంచుకున్న వ్యవసాయ క్షేత్రంలో అభిమానుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు.


