పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నది నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతోంది. పొలాలు, శ్మశాన వాటికలు, బ్రిడ్జిల పక్కన ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చిత్రావతి నదిలో నీళ్లు పూర్తిగా తగ్గిపోతుండడంతో అక్రమార్కులు ఇసుకను జోరుగా తరలిస్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా పట్టణంలో పలు బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో పాటు పక్క రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ కొందరు టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. నాలుగు రోజులుగా రాయలవారిపల్లి, ఎనుములపల్లి సమీపంలోని చిత్రావతిలో హిటాచీలు ఏర్పాటు చేసి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇటీవల జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారులు మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ముదిగుబ్బ పోలీస్స్టేషన్కు తరలించారు.


