● జిల్లా వ్యాప్తంగా జనాదరణ లేక
వెలవెలబోయిన కార్యక్రమం
● కార్మికులను బలవంతగా
తరలించిన వైనం
పుట్టపర్తి టౌన్: తెలుగుదేశం పార్టీ గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, భవిష్యత్ కార్యాచరణ, పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు డిజిటల్ మహానాడు కార్యక్రమం నిర్వహించి పలు తీర్మానాలు చేయాలని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లో రెండు రోజుల పాటు డిజిటల్ మహానాడు కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పసుపు జెండాలు, ఫ్లెక్సీలు, స్టిక్కర్లు, సౌండ్ సిస్టమ్తో ఏర్పాట్లను గొప్పగా చేసుకున్నారు. మెదటి రోజు అరకొరగా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండోరోజు మాత్రం పూర్తిస్థాయిలో మహానాడు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. జనాదరణ లేక మహానాడు ప్రాంగణాలు వెలవెలబోయాయి. రెండేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రజల నుంచి స్పందన కరువైంది. కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఉపాధి హామీ కూలీలను, మధ్యాహ్నం భోజన ఏజెన్సీ పథకం కార్మికులను, డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులను బలవంతగా తరలించారు. సమావేశం పూర్తి కాకుండా ఎవరూ బయటకు వెళ్లిపోకుండా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు గేట్లకు తాళాలు వేసుకొనిమరీ సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు తెలుగు తమ్ముళ్లు అష్టకష్టాలు పడ్డారు. పుట్టపర్తి పట్టణం సాయి ఆరామంలో పుట్టపర్తి మండలానికి సంబంధించి మహానాడు కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలు బయటకు వెళ్లకుంగా గేటుకు తాళం వేయకుండా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం చర్చనీయాంశమైంది.


