చిలమత్తూరు: పనితీరు మెరుగుపడకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హిందూపురం మున్సిపాలిటీ అధికారులను జేసీ మౌర్యభరద్వాజ్ హెచ్చరించారు. బుధవారం హిందూపురంలోని పలు వార్డులు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన మున్సిపల్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ (సర్)లో భాగంగా కొనసాగుతున్న ఓటర్ల మ్యాపింగ్, బుత్ లెవెల్ ఫీల్డ్ వెరిఫికేషన్ను స్వయంగా ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. పనుల్లో పురోగతి లేకపోవడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎల్ఓల ఫీల్డ్ వెరిఫికేషన్ మెరుగుపడాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఎస్ఐఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. 18 ఏళ్లు పైబడిని అర్హులైన వారిని కొత్త ఓటరుగా నమోదు చేయించాలన్నారు.ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కు కల్పించేలా మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన 110, 113 పోలింగ్ కేంద్రాలు, 8, 9 వార్డు సచివాలయాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రీ సర్వేను వేగవంతం చేయాలి
లేపాక్షి: మండలంలో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలనిసంబంధిత అధికారులను జేసీ మౌర్యభరద్వాజ్ ఆదేశించారు. బుధవారం లేపాక్షి మండలం కల్లూరు గ్రామ సచివాలయాన్ని ఆయన తనికీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. భూముల రీసర్వే ప్రక్రియపై ఆరా తీశారు. గడువు లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం 164వ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ కుమార్స్వామిరెడ్డి, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్


