● కేంద్ర పట్టుమండలి కార్యదర్శి సభ్యుడు శివకుమార్
హిందూపురం: స్థానిక పట్టుగూళ్ల మార్కెట్లో రైతులకు మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను కేంద్ర పట్టు మండలి కార్యదర్శి సభ్యులు శివకుమార్, విజయకర్ ఆదేశించారు. మార్కెట్లో నిర్మాణంలో ఉన్న పట్టుగూళ్ల విక్రయ కేంద్రాన్ని బుధవారం వారు పరిశీలించారు. నిర్మాణ పురోగతి, నాణ్యతపై ఆరా తీశారు. భవన నిర్మాణానికి పట్టు మండలి ద్వారా కేంద్రం రూ.4కోట్లు, మరో రూ.4కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు వివరించారు. రైతులకు విశాంత్రి గదులు, క్యాంటీన్ వసతి సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పట్టుగూళ్ల నాణ్యతను పరిశీలించారు. నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించి, అవసరమైన సలహాలు సూచనలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో పట్టుపరిశ్రమ శాఖ ఏడీ అరుణకుమారి, జేడీ శోభారాణి, ఏపీఎస్ఎస్ఆర్డీఐ డైరెక్టర్ డాక్టర్ సీతారాములు, శాస్త్రవేత్త డాక్టర్ మురళి, అనంతపురం డీడీ ఉమామహేశ్వరరావు, హిందూపురం మార్కెట్ ఇన్చార్జ్ హంపయ్య, మడకశిర ఏడీ హనుమంతరాయ, ఆర్అండ్బీ ఇంజనీర్ మోహన్బాబు, అధికారులు పాల్గొన్నారు.


