హిందూపురం: త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్ పండుగను ముస్లిం కుటుంబాలు శాంతియుత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన హిందూపురంలో పర్యటించారు. బక్రీద్ సందర్భంగా పట్టణంలో పలు ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తు, పోలీసు పికెట్లును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం పట్టణంలోని ముఖ్య ప్రార్థనా మందిరాలు, ఈద్గాలను పరిశీలించి మతపెద్దలతో మాట్లాడారు. ప్రార్థనల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలోని పీస్ కమిటీ సభ్యులు, మత పెద్దలతో సమావేశమై పలు సూచనలు చేశారు. పండుగను అందరూ కలిసిమెలిసి సామరస్యంగా జరుపుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులను నమ్మవద్దన్నారు. పండుగ సందర్భంగా పట్టణంలోని ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ వెంట హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్, సీఐలు జనార్దన్, ఆంజనేయులు, రాజగోపాల్ నాయుడు, అబ్దుల్ కరీం, ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
భద్రతా ఏర్పాట్ల పరిశీలన..
గోరంట్ల: బక్రీద్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బుధవారం ఏఎస్పీ అంకిత సురాన, సీఐ శేఖర్తో కలిసి స్థానిక ఈద్గాతో పాటు పలు మసీదులను సందర్శించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భద్రతా ఏర్పాటు చేయాలని సీఐ శేఖర్ను ఆదేశించారు. ప్రార్థనల సమయంలో ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ వాహనాలను నిర్ణీత ప్రదేశంలోనే నిలపాలని ముస్లింలకు సూచించారు.
హిందూపురంలో ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ సతీష్కుమార్


