అమరాపురం: మండల పరిధిలోని ఉదుగూరు గ్రామంలోని ఆర్డీటీ కాలనీ వాసులు తాగునీటి సమస్య పరిష్కారానికి పోరుబాట పట్టారు. కాలనీలో నెలరోజులుగా తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చినా స్పందించని అధికారుల వైఖరిని నిరసిస్తూ ఖాళీ బిందెలతో బుధవారం సచివాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వార్డు మాజీ సభ్యుడు శివన్న, మహిళలు గంగమ్మ, భాగ్యమ్మ, చంద్రమ్మ, లోకమ్మ తదితరులు మాట్లాడారు. ఆర్డీటీ కాలనీలో 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, నెలరోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదన్నారు. దీంతో తాము వ్యవసాయ బోరు బావుల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నామన్నారు. తమ సమస్యను కార్యదర్శికి తెలిపినా స్పందన కరువైందన్నారు. అందువల్లే సచివాలయం ముట్టడించామన్నారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని, లేదంటే ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలు పాల్గొన్నారు.
ఉదుగూరులో తాగునీటి కోసం
మహిళల పోరుబాట


