ప్రశాంతి నిలయం: త్యాగ నిరతికి, అల్లాహ్పై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగ (ఈద్–ఉల్–ఆదా)ను ముస్లింలు గురువారం ఘనంగా జరుపుకోనున్నారు. పండుగ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం ఖబ్రస్థాన్లోని తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు చేయనున్నారు. ఇందుకోసం జిల్లాలోని ఈద్గాలు, మసీదుల వద్ద ఏర్పాట్లు చేశారు.
ముస్లింలకు కలెక్టర్ పండుగ శుభాకాంక్షలు..
జిల్లాలోని ముస్లింలకు కలెక్టర్ శ్యాం ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్ పండుగ త్యాగానికి, దాతృత్వానికి ప్రతీక అన్నారు.
ఈ నెల 31లోపు
బ్యాంకు ఖాతా తెరవాలి
పుట్టపర్తి అర్బన్: ఇంటర్లో చేరే విద్యార్థులు ‘తల్లికి వందనం’ పొందాలంటే ఈ నెల 31వ తేదీలోపు తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా షెడ్యూల్ కులాల సాధికారత అధికారి రెడ్డి బాలాజి సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తల్లికి వందనం’ పథకం నిధులు జూన్లో విడుదలయ్యే అవకాశం ఉందని, అందువల్ల ఇంటర్లో చేరే విద్యార్థులు తప్పనిసరిగా బ్యాంకు లేదా పోస్టాఫీస్లలో నూతన ఖాతాలు ప్రారంభించాలన్నారు. ఈ ఖాతాను ఎన్పీసీఐ లింక్ చేయించడం ద్వారా మాత్రమే తల్లికి వందనం ప్రయోజనాలు అందుతాయన్నారు. కళాశాల యాజమాన్యాలు, స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది విద్యార్థి పేరు మీద తప్పని సరిగా ఖాతాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.


