చిలమత్తూరు: మండలంలో సోమవారం ఉదయం ఆరుగంటల సమయంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో సుమారు రెండు గంటల పాటు బీభత్సం సృష్టించింది. చిన్నన్నపల్లిలో రైతు నాగభూషణరెడ్డి పొలంలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు రాలడంతో మంటల్లో కాలిపోయింది.
బీటెక్ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన బీటెక్ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలను ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి సోమవారం విడుదల చేశారు. ఫలితాల కోసం కళాశాల అకడమిక్ సెక్షన్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎం.రామశేఖరరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ బి.దిలీప్ కుమార్, ప్రొఫెసర్ టి.నారాయణరెడ్డి, ఎగ్జామినేషన్స్ ఇన్చార్జ్ కె.మాధవి, ప్రొఫెసర్ ఆర్.రాజశేఖర్, ప్రొఫెసర్ జయలక్ష్మి, డాక్టర్ కళ్యాణి రాధ పాల్గొన్నారు.
నేడు మెగా జాబ్ మేళా
హిందూపురం టౌన్: స్థానిక ఎస్డీజీఎస్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్ర కుమార్ సోమవారం వెల్లడించారు. మొత్తం 12 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఆయా కంపెనీల అవసరాల నిమిత్తం మానవ వనరులను ఎంపిక చేయనున్నాయి. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హత కలిగి 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న వారు అర్హులు. ఎంపికై న వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకూ జీతం చెల్లిస్తారు. పెనుకొండ, హిందూపురం, పాలసముద్రం, అనంతపురం, బెంగళూరు ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 99594 16770, 96767 06976 లో సంప్రదించవచ్చు.


