అనంతపురం కల్చరల్: అనంత సాహితీలోకంలో అందమైన కథలను వండివార్చిన ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త భాస్కర బాల భారతమ్మ (86) అనారోగ్య కారణాలతో విజయవాడలో కన్నుమూశారు. ఆమె భౌతిక కాయాన్ని ఆదివారం అనంతపురం శ్రీనగర్ కాలనీలోని స్వగృహానికి తీసుకొచ్చారు. అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, సాహితీప్రియులు ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. కేఎస్ఆర్ బాలికల కళాశాల ప్రిన్సిపాల్గా, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ విభాగం ఇన్చార్జ్గా, ఇంటర్మీడియెట్ బోర్డు మెంబర్గా పనిచేసిన భాస్కర బాల భారతమ్మ వేల సంఖ్యలో కవితలు, 120 కథలను రచించి ‘కవితా భూషణ్’ అ వార్డు అందుకున్నారు. సొంతంగా మూడు స్కూళ్లను స్థాపించారు. బాల భారతమ్మ కుమార్తె రాధిక ప్రస్తుతం ఐపీఎస్ అధికారిణిగా సేవలందిస్తున్నారు.
అనంత సాహిత్యానికి తీరని లోటు
బాల భారతమ్మ భౌతికకాయం వద్ద నివాళులర్పించిన కవియిత్రులు డాక్టర్ ప్రగతి, డాక్టర్ అనంత మాలతి, డాక్టర్ ప్రసూన, నిర్మలారాణి తదితరులు మాట్లాడుతూ అనేక హృద్యమైన కథా సంపుటాలతో, ఆలోచనాత్మకమైన వ్యాసాలతో అనంత సాహిత్యానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన బాల భారతమ్మ మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలోనూ ఎంతో మంది యువ రచయిత్రులకు స్ఫూర్తినింపారన్నారు.
గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి
రొద్దం: గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్, కేంద్ర సంఘటన కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ అధ్యక్షతన ఆదివారం మండల పరిధిలోని ఎల్జీబీ నగర్ సమీపంలోని సాయి గీతా కన్షెన్ హాల్లో పండిట్ దీనదయళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ బీజేపీ సిద్దాంతాలు, కార్యవిస్తారణ, కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజల్లో తీసుకువెళ్లాలని సూచించారు. పార్టీని బుత్స్థాయిలో బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎంబ్రాయిడరీ, పెయింటింగ్పై ఉచిత శిక్షణ
పుట్టపర్తి టౌన్: కెనరాబ్యాంక్ రీసెట్ ఐ సౌజన్యంతో హ్యాండ్స్ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ మగ్గం వర్క్స్పై నెల రోజులు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శాంతిప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గ్రామీణా ప్రాంతానికి చెందిన 18 నుంచి 50 సంవత్సరాల్లోపు వారికి పుట్టపర్తి సమీపంలో బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న కెనరాబ్యాంక్ రీసెట్ ఐ కార్యాలయంలో శిక్షణ ఇస్తామన్నారు. జూన్ 15 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఆధార్ ,రేషన్కార్డు, నాలుగు ఫోటోలు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, తమ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్లతో సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యవకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9705091727, 9391486292 లను సంప్రదించాలన్నారు.


